వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు.. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాల్లో అవినీతి జరిగిందంటూ సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలసిందే. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ విచారించింది.
పిటిషన్ విచారణ సందర్భంగా.. సీఐడీ/సిట్ అధికారుల తరుఫున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా గురువారం రోజున వాదనలు వినిపించారు. ఆన్లైన్ విధానంలో ఉండే మద్యం ఆర్డర్లు, సరఫరాను వైసీపీ హయాంలో మ్యాన్యువల్ విధానానికి మార్చారని.. ఇందులో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారంటూ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అలాగే ముడుపులు అందించిన సంస్థలకు మాత్రమే మద్యం సరఫరాకు పర్మిషన్లు ఇచ్చారని కోర్టులో వాదించారు. ఏపీలో లిక్కర్ కుంభకోణం కారణంగా రూ.3500 కోట్లు వరకూ ప్రభుత్వానికి నష్టం జరిగిందని వాదించారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని.. సాక్షులు వాంగ్మూలం ఇచ్చారంటూ సిద్దార్థ్ లూథ్రా హైకోర్టులో వాదించారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని వాదించారు.
మరోవైపు మిథున్ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి.. మద్యం విధానానికి మిథున్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వాదించారు. షరతులతో మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్ మీద గురువారం వాదనలను పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తాజాగా మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును వెల్లడించింది. లిక్కర్ కుంభకోణం కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో మిథున్ రెడ్డికి ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa