ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏసీబీ అదుపులో కాళేశ్వరం మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు

Crime |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 09:25 PM

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని సర్కార్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన పలువురు అధికారుల అవినీతిపై ఏసీబీ బృందాలు లోతైన దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇప్పటికే మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) హరి రామ్, ఈఈ నూనె శ్రీధర్‌లను అరెస్టు చేసిన ఏసీబీ.. తాజాగా మరో కీలక అధికారి, మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావును సైతం అదుపులోకి తీసుకుంది. ఆయన ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల నివాసాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తోంది.


కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మురళీధర్ రావు కీలక పాత్ర పోషించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం నుంచే ఏసీబీ అధికారులు బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో సోదాలు ప్రారంభించారు. హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో మొత్తం 10 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులో మురళీధర్ రావు కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లు కూడా ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులను ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్-కాంట్రాక్టుల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది.


ఏసీబీ చేపట్టిన ఈ దాడులు కొత్తవి కాదు. గతంలో అరెస్టు చేసిన మాజీ ఈఎన్‌సీ హరిరామ్, ఈఈ నూనె శ్రీధర్‌ల ఇళ్లలో జరిపిన సోదాల్లోనూ ఏసీబీ వందల కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అక్రమాలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సబ్-కాంట్రాక్టులు, నిధుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల నుంచి వచ్చాయని అనుమానిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ విచారణను చేపట్టింది. ఈ కమిషన్ విచారణలో మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావును కూడా విచారించారు.


అయితే, కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన 'నాకు తెలియదు.. మర్చిపోయాను' వంటి సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ నివేదికలో వీరితోపాటు మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు పేరు కూడా ఉండటంతో, ఆయనపై ఏసీబీ దృష్టి కేంద్రీకరించింది. మురళీధర్ రావు ఇళ్లలో సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాలు పూర్తయిన అనంతరం ఆయన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఏసీబీ దర్యాప్తు మరింత తీవ్రతరం కానుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa