ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమ్ముడు, ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య

Crime |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 09:24 PM

వివాహేతర సంబంధాల మోజులో భార్యలు కట్టుకున్న భర్తలను అత్యంత కిరాతకంగా అంతమొందిస్తున్న ఘటనలు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. పక్కచూపులు చూసిన భార్యలు భర్తను అడ్డుతొలగించుకోవడానికి పన్నే ప్రణాళికలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇలాంటి దారుణ ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య ఏకంగా తన తమ్ముడు, ప్రియుడితో కలిసి 22 ఏళ్లుగా తన తోడుగా ఉన్న భర్తను కిరాతకంగా హత్య చేయించింది. ఈ హత్యను అత్యంత చాకచక్యంగా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి అన్ని రకాలుగా ప్రయత్నించింది. కానీ, పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బయటపడి, ఈ దారుణం వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి వచ్చాయి.


 వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామి, భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 22 ఏళ్ల క్రితం ఆయనకు వివాహం జరగ్గా, వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి స్వామి తన స్నేహితుడు వీరబాబుతో కలిసి భువనగిరిలో పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిలోని కాటేపల్లి బ్రిడ్జి దాటగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక కారు వారి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టి దాదాపు 50 మీటర్ల దూరం ఈడ్చుకువెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో వస్తువుల స్వామి అక్కడికక్కడే మృతి చెందగా వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి.


స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వీరబాబును మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఇది కేవలం ఒక రోడ్డు ప్రమాదమే అని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, ఎక్కడో చిన్న అనుమానం మొదలైంది. స్వామి భార్య తరుపువారే హత్య చేసి ఉంటారని అనుమానిస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి బాబాయి అయిలయ్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


దర్యాప్తులో భాగంగా స్వామి భార్య స్వాతి, ఆమె తమ్ముడు మహేష్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు దారుణం బయటపడింది. స్వామి భార్య స్వాతికి తుర్కపల్లి మండలం పల్లెపహాడ్‌కు చెందిన సాయికుమార్‌తో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త స్వామి పలుమార్లు ఆమెను మందలించాడు. దీంతో, తన వివాహేతర సంబంధానికి భర్త స్వామి అడ్డుగా ఉన్నాడని భావించిన స్వాతి, అతడిని అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది.


ఈ దారుణమైన ప్రణాళికలో తన తమ్ముడు మహేష్‌ను, ప్రియుడు సాయికుమార్‌ను భాగం చేసింది. సాయికుమార్ ఒక కారును అద్దెకు తీసుకువచ్చి తన స్నేహితుడితో కలిసి కారు నడుపుకుంటూ పథకం ప్రకారం స్వామి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. అనంతరం అక్కడే ఉన్న మామిడి తోటలో కారును వదిలేసి పరారయ్యారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని చిత్రీకరించేందుకు వీరంతా ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.


తన తండ్రి మరణంపై స్వామి కుమారుడు చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. 'నా తల్లే నా తండ్రిని చంపించి, చనిపోయిన తర్వాత లేనిపోని నిందలు మోపుతోంది. మా డాడీ చాలా మంచోడు. మా మామయ్య కూడా మోసం చేసిండు. డబ్బులు తీసుకొని.. డాడీని చంపించిండు. మా అమ్మే డాడీని చంపించింది.' అని ఆ చిన్నారి చెప్పిన మాటలు అందరిచే కంటతడి పెట్టించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో స్వాతి, మహేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనం నడిపిన సాయికుమార్, వాహనంలో ఉన్న మరొకరిని ఇంకా పట్టుకోవాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa