బెంగుళూరు ఈస్ట్రన్ లోని భారతినగర్లో రౌడీషీటర్ శివప్రకాశ్ అలియాస్ బిక్లు శివ (40) హత్య కలకలం రేపింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మోటార్సైకిళ్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్లతో శివపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హలసూరు సరస్సు సమీపంలోని మీనీ అవెన్యూ రోడ్డులో చోటుచేసుకుంది. శివ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్తో సహా ఐదుగురిపై భారతినగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈ హత్యకు సంబంధించి ప్రాపర్టీ వివాదమే ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. శివప్రకాశ్ 2023లో కిత్తగనూర్లో ఒక భూమిని కొనుగోలు చేసి, దానికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) పొందాడు. ఈ భూమిపై గుండెగా పేరున్న జగదీశ్, కిరణ్లతో పాటు ఎమ్మెల్యే బసవరాజ్ సహచరులు శివను బెదిరించి జీపీఏను తమకు బదిలీ చేయాలని ఒత్తిడి చేసినట్లు విజయలక్ష్మి ఆరోపించారు. శివ ఈ బెదిరింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, తగిన చర్యలు తీసుకోలేదని, ఎమ్మెల్యే రెచ్చగొట్టడంతోనే ఈ హత్య జరిగినట్లు ఆమె ఆరోపించారు.
పోలీసులు ఈ ఘటనపై విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. శివప్రకాశ్పై 2006 నుంచి 11 కేసులతో రౌడీషీట్ నమోదై ఉందని, అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడి సమయంలో శివతో ఉన్న అతని డ్రైవర్ ఇమ్రాన్ ఖాన్, స్నేహితుడు లోకేశ్లపై కూడా దాడి జరిగింది. లోకేశ్ ఈ దాడిని తన మొబైల్లో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. బైరతి బసవరాజ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు, తాను ఈ కేసుతో సంబంధం లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa