ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌కు మరో గట్టి షాక్.. 27 మంది సైనికుల హతం

international |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 08:05 PM

పాకిస్థాన్‌కు మరో గట్టి దెబ్బ తగిలింది. బలోచ్ పోరాట యోధులు జరిపిన వరుస దాడుల్లో దాదాపు 27 మంది పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో స్నైపర్ యూనిట్లు, మెరుగైన పేలుడు పదార్థాలు వాడినట్లు నేరుగా ఆ సంస్థే ప్రకటించింది. ముఖ్యంగా బీఎల్ఏకు చెందిన ఫతే స్క్వాడ్ కలాత్‌లోని నిమ్రాగ్ క్రాస్ వద్ద సైనికులను తరలిస్తున్న ఓ బస్సును లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఇందులో 27 మంది సైనికులు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఈ బస్సు కరాచీ నుంచి క్వెట్టాకు తరలిస్తుండగా ఈ దాడి జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. బలోచ్ వేర్పాటువాద గ్రూపులు పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా క్వెట్టాలోని హజార్ గంజ్‌లో ఐఈడీ పేలి మరో ఇద్దరు సైనికులను హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటించింది. మంగళవారం కలాత్‌లోని ఖజినా ప్రాంతంలో మరో ఐఈడీ పేల్చి నలుగురు సైనికులను మట్టుబెట్టింది. అలాగే బుధవారం రోజు గుజ్రోకొర్ ఏరియాలో దాడి చేసి మరో ఆరుగురు సైనికులను హత్య చేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది. వీరిలో మేజర్ సయిద్ రబ్ నవాజ్ తరీక్ కూడా ఉన్నట్లు చెప్పింది. అలాగే సమీపంలోని సైనికుల కాన్వాయ్‌పై స్నైపర్ యూనిట్ కాల్పులు జరిపగా.. కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు బీఎల్ఏ దళ సభ్యులు చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఖండించింది.


ఇలా వేర్వేరు ప్రాంతాలలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు ఉపయోగించి దాడులు జరిగాయి. రహదారుల పక్కన గస్తీ మార్గాలలో అమర్చిన ఈ బాంబులు పేలడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఇలా అనేక చోట్ల చేసిన దాడుల్లో మొత్తంగా 27 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి నెల నుంచి జూన్ వరకు బలోచ్ రెబల్స్ మొత్తం 286 దాడులు చేశారు. అనేక రకాల వ్యూహాలను అమల్లోకి తెచ్చి 700 మందికి పైగా సైనికులను హతమార్చారు. 290 మందిని అదుపులోకి కూడా తీసుకున్నట్లు బీఎల్ఏ చెబుతోంది. ఈక్రమంలోనే 133 వాహనాలను లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా ఓ రైలునే హైజాక్ చేసింది. దీంతోపాటు ఈ ఏడాది మొత్తం 45 వ్యూహాత్మక ప్రాంతాలను పాక్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.


బలోచిస్థాన్ ప్రావిన్స్ సహజ వనరులతో సమృద్ధిగా ఉన్నప్పటికీ.. ఈ ప్రాంత ప్రజలు తమ హక్కుల కోసం, వనరుల నియంత్రణ కోసం దీర్ఘ కాలంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బలోచ్ లిబరేషన్ ఆర్మీ వంటి వేర్పాటువాద గ్రూపులు పాకిస్థాన్ భద్రతా దళాలపై తరచుగా దాడులకు పాల్పడుతున్నాయి. ఈ తాజా దాడులు.. ప్రాంతంలో భద్రతా బలగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టం చేస్తున్నాయి. తరచుగా జరిగే ఇలాంటి దాడులు సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయని.. ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తున్నాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa