దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ విస్తృత తనిఖీలు చేపడుతోంది. మల్టీనేషనల్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులుఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద తప్పుడు డిడక్షన్లు క్లెయిమ్ చేసి పన్ను వాపసు పొందుతున్నారని గుర్తించింది. దీనిపై దృష్టి సారించిన ఆదాయపు పన్ను శాఖ విస్తృత తనిఖీలు చేస్తోంది. చాలా మంది ఉద్యోగులు సమర్పించిన క్లెయిమ్లలో వాస్తవం లేదని, ఎక్కువ మొత్తంలో క్లెయిమ్ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 10(14), 80GG, 80E, 80D, 80EE, 80EEA, 80G, 80GGA, సెక్షన్ 10(13A) కింద పన్ను మినహాయింపులను ఉద్యోగులు దుర్వినియోగం చేస్తున్నారని ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 'కొంతమంది ఐటీఆర్ ప్రిపేరర్లు, మధ్యవర్తులు కలిసి వ్యవస్థీకృత రాకెట్ను నడుపుతున్నారని దర్యాప్తులో తేలింది. వీరు తప్పుడు డిడక్షన్లు, మినహాయింపులు క్లెయిమ్ చేస్తూ రిటర్న్లు దాఖలు చేస్తున్నారు. ఈ మోసపూరిత ఫైలింగ్లలో కొన్ని తప్పుడు టీడీఎస్ రిటర్న్లను సమర్పించి ఎక్కువ రీఫండ్ పొందుతున్నారు' అని ఓ ప్రకటనలో తెలిపింది.
జూలై 14న ఆదాయపు పన్ను శాఖ దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు ప్రారంభించింది.ఆదాయపు పన్ను రిటర్న్లలో తప్పుడు డిడక్షన్లు, మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు చేస్తున్నారు. కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్లు (CAలు), మధ్యవర్తులు కలిసి వ్యవస్థీకృత రాకెట్ను నడుపుతున్నారని ఐటీ శాఖ దర్యాప్తులో వెల్లడైంది. డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో ఈ అక్రమాలను గుర్తిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, కర్ణాటకలలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు లభ్యమయినట్లు తెలిపింది.
పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనిలో భాగంగా ఐటీ రిటర్న్లను పరిశీలించడం, వాపసులను నిలిపివేయడం, జరిమానాలు విధించడం, అవసరమైతే ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించడం వంటి చర్యలు తీసుకోనుంది. మున్ముందు ఈ తనిఖీలు మరింత విస్తృతం కానున్నాయని, ట్యాక్స్ పేయర్లు వెంటనే అప్డేటెడ్ ఐటీఆర్ (ITR-U) ఫైల్ చేయాలని సూచించింది.
ఇటీవలి కాలంలో 40 వేల మంది ట్యాక్స్ పేయర్లు తమ అప్డేటెడ్ రిటర్నులు ఫైల్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. వారంతా సుమారు రు.1000 కోట్ల మేర బోగస్ క్లెయిమ్స్తో రీఫండ్ పొందినట్లు గుర్తించింది. ఇంకా చాలా మంది ఇలా బోగస్ క్లెయిమ్స్ చేశారని, వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్డేటెడ్ రిటర్నులు ఫైల్ చేసి కఠిన చర్యల నుంచి తప్పించుకోవాలని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa