సాధారణంగా బడుల్లో పిల్లలు తప్పు చేస్తే ఉపాధ్యాయులు పనిష్మెంట్ ఇస్తుంటారు. ఎండలో, మోకాళ్ల మీద, బెంచీలపై నిలబడమని చెబుతుంటారు. ఇదంతా మనం పాఠశాలల్లోనే చూశాం. కానీ దేశరాజధాని ఢిల్లీకి చెందిన ఓ న్యాయస్థానం కూడా ఇలాంటి తరహా పనిష్మెట్నే ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా నలుగురు నిందితులకు.. చేతులు పైకెత్తి కోర్టు సమయం ముగిసే వరకు హాల్లోనే నిలబడాలని న్యాయమూర్తి చెప్పారు ముఖ్యంగా న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేసినందుకు, బెయిల్ బాండ్లను సకాలంలో సమర్పించడంలో విఫలమైనందుకుగాను నలుగురు నిందితులకు ఈ పనిష్మెంట్ ఇచ్చారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ అయింది.
ఈ కేసు 2018 నాటి ఆస్తి వివాదానికి సంబంధించినది. పాలం గ్రామంలోని ద్వారకా ప్రాంతంలో ఒక స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదుదారు హర్కేష్ జైన్ ఆరుగురు వ్యక్తులపై (అనిల్, రామ్ కుమార్, ఆనంద్, కుల్దీప్, రాకేష్, ఉపసన సెహ్రావత్) ఫిర్యాదు చేశారు. కేసు విచారణ కొనసాగుతుండగా.. అనిల్, రామ్ కుమార్ అనే ఇద్దరు నిందితులు మరణించారు. మిగిలిన నలుగురు నిందితులకు గత విచారణలో బెయిల్ మంజూరు చేశారు. అలాగే జూలై 15వ తేదీన బెయిల్ బాండ్లను సమర్పించాలని ఆదేశించారు. బెయిల్ బాండ్లను సమర్పించడంలో విఫలమైతే రూ.10,000 జరిమానా విధిస్తామని కూడా కోర్టు ముందుగానే స్పష్టం చేసింది.
అయితే జూలై 15వ తేదీన కేసు విచారణకు వచ్చినప్పుడు.. ఉదయం 10 గంటల నుంచి 11.40 గంటల వరకు రెండు సార్లు పిలిచినప్పటికీ నిందితులు బెయిల్ బాండ్లను సమర్పించలేదని కోర్టు గుర్తించింది. "కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు, ఇది గత విచారణ తేదీన సక్రమంగా ప్రకటించిన ఆదేశాన్ని ధిక్కరించినందుకు, నిందితులు కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగా నిర్ధారించింది. ఐపీసీ సెక్షన్ 228 కింద నేరానికి దోషులుగా పరిగణించి శిక్షను విధించింది. ముఖ్యంగా కోర్టు సమయం ముగిసే వరకు నలుగురు నిందితులూ.. చేతులు పైకెత్తి నిలబడాలని మేజిస్ట్రేట్ గోయల్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు.
నిందితులలో ఒకరైన కుల్దీప్ బెయిల్ బాండ్లను సమర్పించడంలో విఫలం అవడంతో.. అతన్ని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోర్టు ఆదేశించింది. అయితే మధ్యాహ్నం 12:48 గంటల ప్రాంతంలో కుల్దీప్ తరపు న్యాయవాదులు బెయిల్ బాండ్లను, ష్యూరిటీ పత్రాలను సమర్పించడంతో.. మేజిస్ట్రేట్ వాటిని అంగీకరించి కుల్దీప్కు బెయిల్ మంజూరు చేశారు. ఈ ఘటన కోర్టులో ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది.
ఈ తీర్పుపై సీనియర్ న్యాయవాది, న్యాయ నిపుణుడు సంజయ్ ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు దోషులుగా నిరూపించబడే వరకు అమాయకులుగా పరిగణించబడతారని.. అలాంటి శిక్షలు నిందితుల గౌరవాన్ని తగ్గించేవిగా ఉంటాయని ఆయన అభిప్రాయ పడ్డారు. అంతేకాకుండా కోర్టు ధిక్కార చట్టం 1971 ప్రకారం హైకోర్టులు, సుప్రీం కోర్టులకు మాత్రమే కోర్టు ధిక్కారానికి శిక్షించే అధికారం ఉందని, జిల్లా కోర్టులకు ఈ అధికారం లేదని ఘోష్ పేర్కొన్నారు. ఈ తీర్పు న్యాయ వ్యవస్థలో విధానాలపై చర్చకు దారితీసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa