ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉంది ఆ గ్రూపే.: అమెరికా షాకింగ్ నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 10:14 PM

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు అనుబంధంగా ఉన్న 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF)ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థ (Foreign Terrorist Organization - FTO)గా.. ప్రత్యేకంగా గుర్తించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్ (Specially Designated Global Terrorist - SDGT)గా ప్రకటించింది. ఈ కీలక నిర్ణయాన్ని గురువారం అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించిన నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ దాడిలో మొత్తంగా 26 మంది అమాయకు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.


అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ.. పహల్గామ్ దాడికి న్యాయం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారని చెప్పారు. అందులో భాగంగానే తాము ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎఫ్.. లష్కరే తోయిబా ఎఫ్టీఓ, ఎస్‌డిజిటికి అనుబంధ సంస్థ అని రూబియో వెల్లడించారు. భారత భద్రతా దళాలపై 2024లో జరిగిన పలు దాడులకు కూడా టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని ఆయన వెల్లడించారు. ఈ చర్య అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను పరిరక్షించడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం పట్ల ట్రంప్ పరిపాలన నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు. అలాగే 2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్ల తర్వాత ఇదే అత్యంత దారుణ ఘటన అని చెప్పుకొచ్చారు.


ఈ పరిణామంపై వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది. "భారత్-అమెరికా ఉగ్రవాద వ్యతిరేక సహకారం బలంగా ఉందని ఇది మరోసారి రుజువు చేస్తుంది" అని పేర్కొంది. టీఆర్ఎఫ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా, ప్రత్యేకంగా గుర్తించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్‌గా జాబితా చేసినందుకు అమెరికా విదేశాంగ శాఖకు కృతజ్ఞతలు తెలిపింది. "ఉగ్రవాదం పట్ల సున్నా సహనం!" అనే భారతదేశ వైఖరిని పునరుద్ఘాటించింది.


టీఆర్ఎఫ్ 2019లో ఏర్పడింది. భారత ప్రభుత్వం 2023లో దీనిని నిషేధించింది. ఈ సంస్థ ఆన్‌లైన్‌లో యువతను రిక్రూట్ చేయడంలో.. ఉగ్రవాదుల చొరబాటుకు సహకరించడంలో, పాకిస్థాన్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడంలో చురుకుగా ఉంది. టీఆర్ఎఫ్ అధిపతి షేక్ సజ్జాద్ గుల్‌ను భారతదేశం ఇప్పటికే ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ సంస్థ కార్యకలాపాలకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతు ఉందని నిఘా వర్గాలు తెలిపాయి.


పహల్గామ్ దాడులకు ప్రతీకారంగా భారతదేశం మే 7న 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించి.. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను దాడులు చేసింది. అలాగే ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదులకు పాక్ చేస్తున్న సాయం గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు దేశాల రాయబారులు, విదేశాంగ మంత్రులకు ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చింది. అలాగే అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ విషయాలను వివరించాలని ఎంపీల బృందాలను 33 దేశాల రాజధానులకు పంపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa