ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ సరికొత్త ప్లాన్,,,తిరుమలలో ఇస్రో సేవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 05:03 PM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ఇస్రో సేవల్ని వినియోగించుకోవాలని టీటీడీ రెడీ అవుతోంది. ఈ మేరకు ప్రణాళికల రూపకల్పన చేస్తోంది.. కొన్నేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా.. ముఖ్య వాహన సేవల్లో ఎంతమంది భక్తులు పాల్గొంటున్నారో టీటీడీ సుమారుగా లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరు 24 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే గరుడోత్సవం రోజున భక్తులు భారీగా తరలివస్తారు. అయితే మాడవీధులు, బయట ఎంతమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందనేది అత్యాధునిక శాటిలైట్ల ద్వారా గుర్తించాలని భావిస్తున్నారట. భక్తుల సమాచారాన్ని తెలుసుకొనేందుకు ఇస్రో సాయం తీసుకోనున్నారట. అప్పుడు తగిన విధంగా ఏర్పాట్లు చేయొచ్చని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.


మరోవైపు టీటీడీ అడిషనల్ ఈవో ఇటీవల బ్రహ్మోత్సవాలపై సమీక్ష చేశారు.. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. 'తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి విభాగాధిపతులను ఆదేశించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 23-09-2025 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 24-09-2025 ధ్వజారోహణం, 28-09-2025 గరుడ వాహనం, 01-10-2025 రథోత్సవం, 02-10-2025 చక్రస్నానం ఉంటుంది' అని తెలిపారు.


'ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు. విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, రోడ్ మ్యాప్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశం. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం. భక్తుల అవసరాలకనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టాలి' అని ఆదేశించారు.


'గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని ఆదేశం. భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశం. శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశం. 27-09-2025 రాత్రి 9 నుండి 29-09-2025 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరణ. భక్తుల రద్దీకి తగినవిధంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలి' అని ఆదేశించింది టీటీడీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa