ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం ఉగ్రవాదులు పట్టుబడకముందే పాక్‌తో ఆటలా..:ప్రియాంక చతుర్వేది ఫైర్

national |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 05:34 PM

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిని మర్చిపోకముందే.. భారత మాజీ క్రికెటర్లు పాకిస్థాన్ లెజెండ్స్‌తో క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనడానికి అనుమతించడంపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా శివసేన యూబీటీ పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశంతో ఎలాంటి సంబంధాలు ఉండవని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని BCCIకి గుర్తు చేశారు. అలాగే పహల్గాంలో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులను పట్టుకోకముందే పాక్‌తో మ్యాచ్‌లు ఆడడం సరికాదని వ్యాఖ్యానించారు.


వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నమెంట్‌లో భారత్-పాకిస్థాన్ దిగ్గజాల జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లను అనుమతించడం 'నైతిక దివాలాకోరుతనం' అని ప్రియాంక చతుర్వేది అభివర్ణించారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెడుతూ మరీ.. పహల్గాం ఉగ్రవాద దాడి జరిగి మూడు నెలలు గడిచినా.. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఇప్పటికీ పట్టుకోలేకపోయారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అలాగే ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. ఆమె గుర్తు చేశారు. అయితే తమ వారిని కోల్పోయిన కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయి ఉంటే బీసీసీఐ, ఐసీసీలు తమ డబ్బు గురించి ఆలోచించడం సరికాదన్నారు.


ఇలాంటి పరిస్థితుల్లో కూడా పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లను తిరిగి ప్రారంభించడానికి భారత్.. తీవ్రంగా ఆరాట పడుతున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు ఎలాంటి సందేశం వెళ్తుందని ఆమె కేంద్రాన్ని, బీసీసీఐని నిలదీశారు. అలాగే మ్యాచ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు సంబంధించిన పోస్టర‌ను సోషల్ మీడియాలో షేక్ చేశారు. ఎంపీ ప్రియాంక చతుర్వేది చేసిన ఈ పోస్టుకు పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. అనేక మంది ఈమెకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు.


గతంలో బీసీసీఐ పాకిస్థాన్‌తో ఎలాంటిటి ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను కొనసాగించకూడదని స్పష్టమైన వైఖరి తీసుకుంది. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇప్పుడు లెజెండ్స్ మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సంఘటనల మధ్య కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా బహుళ-దేశీయ క్రీడా ఈవెంట్‌లకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇటీవల ప్రకటించారు. అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లను అనుమతించడం దేశ ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తుందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తీసుకున్న కఠిన వైఖరిని నీరుగార్చినట్లు అవుతుందని విమర్శకులు వాదిస్తున్నారు.


యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత లెజెండ్స్ జట్టు జూలై 20వ తేదీన పాకిస్థాన్ లెజెండ్స్‌తో తలపడనుంది. ఈ WCL అనేది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఆమోదం పొందిన ఒక ప్రైవేట్ లీగ్. అయితే ఒక ప్రైవేట్ టోర్నమెంట్ అయినప్పటికీ.. ఇరు దేశాల మధ్య ఉన్న సున్నితమైన రాజకీయ, భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి మ్యాచ్‌లను నివారించాలని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa