ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విబేధాల తర్వతా తొలిసారి మాల్దీవులకు ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 05:42 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన వచ్చే వారం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), మాల్దీవులను సందర్శించనున్నారు. అయితే గతేడాది మోదీపై, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో.. ఇరుదేశాల మధ్య బంధాలు దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున దౌత్యపరమైన ఉద్రిక్తతలు వచ్చాయి. ఇవన్నీ జరిగి ఏడాది అవుతుండగా.. గొడవల అనంతరం తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.


జులై 23 నుంచి 26వ తేదీ వరకు సాగే ఈ పర్యటనలో.. ప్రధాని మోదీ జూలై 23, 24వ తేదీల్లో బ్రిటన్‌లో పర్యటిస్తారు. అక్కడే ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement - FTA)పై అధికారికంగా సంతకం చేస్తారు. సుమారు మూడేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం గత మే నెలలోనే ఈ చారిత్రాత్మక ఒప్పందం ఖరారైంది. ఈ FTA ద్వారా యూకే మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులు, సేవలకు విస్తృత ప్రాప్యత లభిస్తుంది. అలాగే భారత దేశంలో బ్రిటిష్ ఉత్పత్తులు, సేవల లభ్యత కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ ఒప్పందం రెండు దేశాలలో ఉద్యోగ అవకాశాల సృష్టి, ఆర్థిక వృద్ధి రేటు పెంపుదల, ఎగుమతుల పెరుగుదలకు దోహద పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.


ముఖ్యంగా భారతదేశం నుంచి యూకేకు ఎగుమతి అయ్యే దాదాపు 99 శాతం వస్తువులపై సుంకాలు (టారిఫ్‌లు) రద్దు కానున్నాయి. అదేవిధంగా యూకే నుంచి భారత దేశం దిగుమతి చేసుకునే విస్కీ, కార్లు వంటి 90 శాతం ఉత్పత్తులపై సుంకాలు తగ్గినున్నాయి. ఇది ఇరుదేశాల వినియోగదారులకు లాభదాయకంగా మారుతుంది. వాణిజ్యంతో పాటు రక్షణ, భద్రతా రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకోవడంపై కూడా ప్రధాని మోదీ.. యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో చర్చలు జరపనున్నారు. ఇది భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుంది.


యూకే పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ.. మాల్దీవులకు వెళ్తారు. 25, 26వ తేదీల్లో అక్కడే ఉంటారు. అయితే అక్కడ జరగనున్న 60వ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. గతేడాది జనవరిలో లక్షద్వీప్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. సాహసాలు చేయాలనుకున్న వారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఇది ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరుకున్నాయి. ఈక్రమంలోనే అనేక మంది భారతీయ పర్యాటకులు.. ఆ దేశ టూర్ ప్లాన్‌ను విరమించుకున్నారు. బాయ్‌కాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్‌టాగ్ కూడా ట్రెండ్ అయింది.


దీంతో మాల్దీవ్స్ ప్రభుత్వం.. మంత్రులు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఆపై మంత్రులపై కూడా వేటు వేసింది. ఆ తర్వాత నుంచి అధ్యక్షుడు మయిజ్జు తీసుకున్న భారత వ్యతిరేక నిర్ణయాలు కూడా ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. ఇలాంటి సమయంలోనే ప్రధాని మోదీ మాల్దీవులలో పర్యటించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ పర్యటన సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావడానికి హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa