ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18 ఏళ్లు దాటిన మహిళలకు రూ.18000.. మంత్రి ఆనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 08:01 PM

2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తోంది. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ఇప్పటికే తల్లికి వందనం పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. త్వరలోనే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనుంది. అలాగే ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే మరో హామీ అమలుపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్స్ సిక్స్ హామీలలో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం త్వరలోనే అమలు చేయనున్నట్లు ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.


రాష్ట్రంలోని మహిళలు సొంత కాళ్లపై నిలబడేలా, వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం రూపకల్పన చేశారు. ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హులైన 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆడబిడ్డ నిధి పథకం అమలుపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


నంద్యాల జిల్లా గడివేములలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగానే త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇస్తే కొంతమంది నవ్వుకున్నారని.. ఇప్పుడు అమలు చేస్తుంటే నోరెళ్లబెడుతున్నారని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 నుంచి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నామని.. ఆలయాల్లో ధూప దీప, నైవేద్యాల కోసం పూజారులకు నెలకు రూ.10 వేలు ఇవ్వనున్నామని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. కాల్వబుగ్గ ఆలయానికి కూడా ఏపీ ప్రభుత్వం రూ.4కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు.


మరోవైపు ఆడబిడ్డ నిధి పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. మిగతా హామీలన్నీ అమలు చేశామన్న ఆయన.. ఆడబిడ్డ నిధి పథకం ఎలా అమలు చేయాలనే దానిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa