ఢిల్లీ విమానాశ్రయంలో హాంగ్కాంగ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా AI 315 విమానంలో మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ అయిన కాసేపటికే విమానం ఆక్సిలరీ పవర్ యూనిట్ లో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది అయితే, ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడినట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ‘‘జూలై 22న మంగళవారం హాంగ్కాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI 315 విమానం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయి గేట్ వద్ద పార్క్ చేసిన కొద్ది క్షణాల్లో APUలో మంటలు చెలరేగాయి’’ అని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులు విమానం దిగడానికి సిద్ధమైన సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది.
మంటలు చెలరేగిన తర్వాత ఏపీయూను ఆటోమేటిక్గా స్విచ్ఛాఫ్ చేశామని ప్రతినిధి చెప్పారు. ప్రమాదం కారణంగా విమానం స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలిపారు.
‘‘ప్రయాణికులు, సిబ్బంది అందరూ విమానం నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే APUను ఆటోమేటిక్గా ఆపివేశాం’’ అని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని, విమానాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని పేర్కొంది. దీని గురించి విమానయాన నియంత్రణ సంస్థకు సమాచారం ఇచ్చినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
కాగా, ఈ ఘటనకు 24 గంటల ముందే కోచి నుంచి ముంబయి నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం అదుపు తప్పి రన్వే నుంచి జారిపడింది. దీంతో మూడు టైర్లు, ఇంజిన్ దెబ్బతిన్నాయి. అయితే, ప్రమాణికులు, సిబ్బందికి మాత్రం ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై తక్షణమే స్పందించిన రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని ప్రయాణికులను, సిబ్బందిని క్షేమంగా కిందకు దించాయి . గత నెల అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది 240 మందితో పాటు అది కూలిపోయిన మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలోని విద్యార్థులు, ఉద్యోగులు మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి పలు ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఇదిలా ఉ:డగా, అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రాథమిక నివేదికను ఎయిర్క్రాఫ్ట్స్ యాక్సిడెంట్స్ ఇన్విస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) కేంద్రానికి ఇటీవలే ప్రాథమిక నివేదిక అందజేసింది. అయితే, దీని ఆధారంగా అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనాలపై నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సెకెనులోనే ఇంజిన్ ఎక్కడైనా ఆగిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa