కన్వర్ యాత్ర మార్గంలో దాబాలు, రెస్టారెంట్లు లైసెన్స్, రిజిస్ట్రేషన్ సమాచారం ప్రదర్శించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ‘‘ప్రస్తుత దశలో హోటల్ యజమానులంతా లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను చట్టబద్ధంగా ప్రదర్శించాలి. ఇందులో ఇతర అంశాల జోలికి మేము వెళ్లడం లేదు.. ఈ పిటిషన్ను ఇంతటితో ముగిస్తున్నాం’’ అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది.
కన్వర్ యాత్ర సాగే మార్గంలో దాబాలు, రెస్టారెంట్ల యజమానుల వివరాలను తెలియజేసే QR కోడ్ ప్రదర్శన తప్పనిసరి చేస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండాగానే.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇదే తరహా ఆదేశాలు వెలువరించింది. అయితే, ఇవి పౌరుల మౌలిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని ఆరోపిస్తూ అకడమిక్ అపూర్వానంద్ జ్హా తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఈ QR కోడ్ నిబంధనలు యజమానుల పేరు, గుర్తింపు వివరాలు బహిర్గతం చేస్తూ, మత వివక్షకు దారితీస్తాయి’’ అని వారు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్ మాత్రమే తప్పనిసరి అని, యజమానుల మతపరమైన గుర్తింపును బహిర్గతం చేయడం చట్ట విరుద్ధమని వాదించారు. అంతేకాదు, ఇవి మైనారిటీ వర్గాలకు చెందిన వ్యాపారులపై మతపరమైన దాడులను ప్రేరేపించే ప్రమాదం ఉందని, వ్యాపారుల మౌలిక హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తాయని పిటిషనర్లు హెచ్చరించారు. కాబట్టి, ప్రభుత్వం సాధారణ లైసెన్సింగ్ నిబంధనలకే పరిమితం కావాలని, అర్థంలేని సూచనలను వెంటనే రద్దు చేయాలని కోర్టును కోరారు.
కాగా, గతేడాది కూడా యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు లైసెన్స్ ప్రదర్శించాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ‘‘వారు ఏ రకమైన ఆహారాన్ని విక్రయిస్తున్నారో మాత్రమే తెలియజేయాలి. యజమాని లేదా సిబ్బంది వివరాలు బహిర్గతం చేయాలని బలవంతం చేయరాదు’ అని కోర్టు పేర్కొంది. అయితే, ఈ ఉత్తర్వులను యోగి ఆదిత్యనాథ్ సర్కారు మాత్రం సమర్దించుకుంది. యాత్ర సజావుగా సాగడానికి మాత్రమే ఈ ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపింది.
మరోవైపు, కన్వర్ యాత్రను ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో చేసిన పోస్ట్పై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. రోడ్డుపై కన్వర్ యాత్రికుల వెళ్తున్న ఫోటో.. ఇంకోటి రోడ్డుపై ముస్లింలు నమాజ్ చేస్తోన్న ఫోటోలను షేర్ చేసిన ఆయన.. ఒకే దేశం రెండు చట్టాలా? అంటూ విమర్శలు గుప్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa