రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికులను హడలెత్తించింది. భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో మనోజ్ కుమార్ అనే వ్యక్తి తన నాలుగేళ్ల మేనల్లుడు లోకేశ్ను నరబలి ఇచ్చాడు. ఈ ఘటన సారై కళాన్ గ్రామంలో జులై 19న చోటుచేసుకుంది. మూఢనమ్మకాలకు బలైన మనోజ్, ఓ పూజారి సలహాతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
లోకేశ్(4) ఇంట్లో ఆడుకుంటూ సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై ఊరంతా వెతికారు. అతడి కనిపించకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, ఊరి చివరన ఓ పాడుబడిన ఇంట్లో లోకేశ్ మృతదేహం కనిపించింది. శరీరంపై సూదులు గుచ్చిన గుర్తులు, రక్తం తీసే ప్రయత్నం చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు మనోజ్ కుమార్పై అనుమానం వ్యక్తం చేసి విచారణ చేపట్టారు. తొలుత బాలుడిని వెతుకుతున్నట్లు నటించిన మనోజ్, పోలీసుల విచారణలో నిజం బయటపెట్టాడు. తన భార్యతో గొడవపడి ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో, ఆమెను తిరిగి రప్పించేందుకు పూజారి సునీల్ సలహా మేరకు ఈ హత్యకు పాల్పడినట్లు అతడు వెల్లడించాడు. పూజారి సునీల్, బలి కోసం రూ.12 వేల నగదు, బాలుడి రక్తం, కాలేయం అవసరమని చెప్పినట్లు తెలిపాడు.
పోలీసులు మనోజ్ కుమార్ను అదుపులోకి తీసుకోవడంతో పాటు, పూజారి సునీల్ను కూడా అరెస్టు చేశారు. ఈ ఘటనలో సునీల్కు ఇతర నరబలి కేసుల్లో ప్రమేయం ఉందేమోనని పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. స్థానికులు, కుటుంబ సభ్యులు ఈ దారుణ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన మూఢనమ్మకాలు, మాంత్రిక చర్యలపై నమ్మకం ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa