ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ 12 మంది నిర్దోషులంటూ ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే

national |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 06:52 PM

భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచి ముంబయి రైలు పేలుళ్ల కేసు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో మొత్తంగా 12 మంది నిందితులుగా ఉండగా.. వారిని రెండ్రోజుల క్రితమే బాంబై హైకోర్టు నిర్దోషులుగా తేలుస్తూ తీర్పును ఇచ్చింది. ఈ సంచలనాత్మక తీర్పుతో దేశం మొత్తం ఈ కేసుపై ఆసక్తి చూపించగా.. తాజాగా సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈక్రమంలోనే విచారణ జరిపిన న్యాయస్థానం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఈ కేసు విచారణ మరోసారి కీలక మలుపు తిరిగింది.


2006లో ముంబై సబర్బన్ రైళ్లలో ఏడు చోట్ల ఏక కాలంలో బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో మొత్తంగా 189 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే 800 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశంలోనే ఒక పెద్ద ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తునకు దారి తీసింది. ముఖ్యంగా ఈ దాడులకు సంబంధించి ఒక ప్రత్యేక ట్రయల్ కోర్టు.. 2015లో మొత్తం 12 మంది నిందితులను దోషులుగా నిర్ధారించింది. వారిలో ఐదుగురికి మరణశిక్ష విధించగా, ఏడుగురికి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. అయితే మరణశిక్ష పడిన వారిలో ఒకరు 2021లో మరణించారు.


ఆ తర్వాత ఈ నిందితులు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అంటే 2025 జూలై 23వ తేదీన బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఈక్రమంలోనే ఇరువురు తరఫు వాదనలు విన్న న్యాయస్థానం ఈ 12 మందిని నిర్ధోషులుగా తేలుస్తూ తీర్పును ఇచ్చింది. ప్రాసిక్యూషన్ తమ కేసును "పూర్తిగా నిరూపించడంలో విఫలమైంది" అని చెబుతూ.. నిందితులను విడుదల చేసింది. అయితే ఈ తీర్పును వసాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.


ముఖ్యంగా జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్‌పై వారి స్పందన ఇవ్వాలని తెలిపింది. అలాగే హైకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదల అయిన నిందితులను మళ్లీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును భవిష్యత్తులో ఏ కేసులోనూ ఒక ఆదర్శంగా (ప్రిసిడెంట్‌గా) పరిగణించకూడదని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇది హైకోర్టు తీర్పులోని లోపాలను, తీవ్రతను నొక్కి చెబుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa