భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్. రైలు ప్రయాణానికి సంబంధించిన అత్యవసర కోటా (ఎమర్జెన్సీ కోటా) నిబంధనలను భారత రైల్వేశాఖ ఇటీవల కఠినతరం చేసింది. వీటి ప్రకారం.. ఇకపై అన్ని అత్యవసర కోటా దరఖాస్తులను ప్రయాణానికి కనీసం ఒక రోజు ముందుగానే సమర్పించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సైతం అదే రోజు దరఖాస్తు చేసుకునే పద్ధతిని పూర్తిగా రద్దు చేశారు. అయితే ఇలా చేయడానికి ఓ పెద్ద కారణమే ఉంది. అదే రోజు టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల రైల్వే ఛార్ట్ల తయారీని సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. దీని వల్ల కార్యకలాపాల్లో జాప్యం జరుగుతోంది. వీటిని పూర్తిగా నిర్మూలించడానికే భారతీయ రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త నిబంధనల ప్రకారం.. దరఖాస్తులకు నిర్దిష్ట గడువు సమయాలను (కటాఫ్ టైమ్స్) కూడా నిర్ణయించారు. ఉదయం 00:00 గంటల (12 గంటల) నుంచి మధ్యాహ్నం 14:00 (2 గంటల) మధ్య బయలుదేరే రైళ్లకు సంబంధించిన అత్యవసర కోటా దరఖాస్తులు.. అంతకు ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు ఈక్యూ సెల్కు చేరాలి. అలాగే మధ్యాహ్నం 14:01 గంటల నుంచి రాత్రి 23:59 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు.. అంతకు ముందు రోజు సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులు అందాల్సి ఉంటుంది. ఆదివారాలు లేదా ప్రభుత్వ సెలవు దినాల్లో.. దరఖాస్తులను అంతకు ముందు పని దినం నాడే సమర్పించాలి.
ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే శాఖ ఈ మధ్య అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. నియమ, నిబంధనల్లో మార్పులు తెస్తూ.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా చేస్తోంది. ఇందులో భాగంగానే ఛార్ట్ తయారీ సమయాల సవరింపు, OTP (వన్-టైమ్ పాస్వర్డ్) ఆధారిత ధ్రువీకరణతో తత్కాల్ బుకింగ్లను మరింత కఠినతరం చేయడం వంటివి ఉన్నాయి.
ఇవి మాత్రమే కాదండోయ్.. కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ను కూడా రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది. ఇది 2025 డిసెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా రద్దు చేయబడిన, నిర్ధారించబడని వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై విధించే "క్లర్కేజ్" ఛార్జీలను తొలగించే అంశాన్ని కూడా భారత రైల్వే పరిశీలిస్తోంది. ఇది ప్రయాణికులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa