బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా బలపడి, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు కారణమవుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు, రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వాయుగుండం ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమై, వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 48 గంటల్లో ఇది పశ్చిమ బెంగాల్, ఒడిశా ఉత్తర ప్రాంతాల వైపు కదిలే సూచనలు ఉన్నాయి.
ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి సమీక్ష నిర్వహించారు. వాయుగుండం ఈ సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరం దాటే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఆమె తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గండ్లు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 1800-4250101 టోల్ ఫ్రీ నంబర్లకు సంప్రదించాలని వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa