పక్షపాతం కారణంగా ఏళ్లుగా వీల్ఛైర్కే పరిమితమైన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు.. తన కారుణ్య మరణానికి అనుమతించాలని రాష్ట్రపతికి లేఖ రాయడం సంచలనంగా మారింది. తన శరీరం తనకు సహకరించడం లేదని.. పిల్లలకు పాఠాలు చెప్పలేకపోతున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధను ఇక తట్టుకోలేకపోతున్నానని, నరకం నుంచి తనకు విముక్లి కల్పించాలని వేడుకున్నారు. అంతేకాదు, కోహినూర్ వజ్రం కంటే విలువైన తన అవయవాలు ద్వారా వేరొకరికి ప్రాణం పోయాలని ఆమె పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు చంద్రకాంత జేథ్వాని (52) కొన్నేళ్ల కిందట పక్షపాతానికి గురయ్యారు. అయితే, 2020లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా లేచినడవలేని స్థితికి చేరుకున్నారు. ఆమెకు ఓష్ఠ్యోజెనెసిస్ ఇంపెర్ఫెక్టా అనే అరుదైన వ్యాధి ఉంది. దీని వల్ల ఎముకలు పెలుసుగా మారి ఎప్పుడైనా విరిగిపోవచ్చు. కాగా, నెదర్లాండ్ మాజీ ప్రధాని దంపతులు కారుణ్య మరణం ఎంచుకుని గతేడాది ఈలోకం వదిలిపెట్టారు.
అయినప్పటికీ, ఆమె ప్రతి రోజు స్కూల్కు వచ్చి ఎనిమిది గంటలు పాటు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అయితే, తన శరీరాన్ని దానం చేయాలనే సంకల్పంతో కారుణ్య మరణానికి అనుమతి కోరారు. తాను ఆత్మహత్యకు ప్రయత్నించను కానీ నా శరీర భాగాలు మరొకరికి ప్రాణవాయువు కావాలి అని ముర్ముకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆమె అవయవదానమే కాదు.. ఆస్తిని కూడా పేద విద్యార్థులకు దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. తన ఆస్తిని మొత్తం పాఠశాలలోని ఆరుగురు పేద విద్యార్థులకు చంద్రకాంత్ దానం చేశారు. అలాగే, అవయవాలను ఇండోర్లోని ఎంజీఎం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి దానం చేయాలని సంకల్పించారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతోన్న వారికి గౌరవ ప్రదమైన మరణాన్ని ప్రసాదించేలా కారుణ్య మరణానికి అనుమతించాలని గతంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. పరోక్ష కారుణ్య మరణాలు, వాటికోసం సజీవ వీలునామాలు పరిగణించదగ్గవేనంటూ తీర్పులో స్పష్టం చేసింది.
‘‘నా అవయవాలు నాకు ఉపయోగపడకపోయినా, ఎవరికైనా చూపు తిరిగి రావడానికి లేదా ప్రాణం నిలబెట్టేందుకు తోడ్పడితే అవి కోహినూర్ వజ్రానికి మించినవే’’ అంటూ చంద్రకాంత వ్యాఖ్యానించారు. స్కూల్ హెడ్మాస్టర్ సుఖరాం ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఆమె సైన్స్ సబ్జెక్ట్లో నిపుణురాలు. వైద్య సమస్యలు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ విద్యార్థులకు సేవలందిస్తున్నారు. ఆమె కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ లేఖరాశారని తెలియదు’ అన్నారు. కాగా, దీనిపై రాష్ట్రపతి ముర్ము ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఆమె మాత్రం తనకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa