ఆంధ్రప్రదేశ్ మహిళలకు నిజంగానే శుభవార్త స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రభుత్వం వారికి గొప్ప కానుక అందించనుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు నిన్న గుంటూరులో ప్రకటించారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం లక్షలాది మంది మహిళల జీవితాల్లో పెను మార్పు తీసుకురానుంది.జోన్-3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ పథకం వివరాలను ఎండీ తిరుమలరావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జోనల్ చైర్మన్ సురేశ్రెడ్డి చర్చించారు. "రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి" అని ఎండీ తెలిపారు.పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా త్వరలో 1,050 కొత్త బస్సులు ఆర్టీసీకి రానున్నాయి. డీజిల్ బస్సుల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని, విజయవాడ, వైజాగ్లలో తదుపరి సమీక్షా సమావేశాలు జరుగుతాయని ఎండీ వెల్లడించారు.ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ "కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ పథకం రాష్ట్ర మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత బస్సులు, సిబ్బందితోనే ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం" అని హామీ ఇచ్చారు. త్వరలో విడుదల కానున్న మార్గదర్శకాలతో ఈ పథకంపై మరింత స్పష్టత రానుంది. ఈ నిర్ణయం మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా వారి ప్రయాణ స్వేచ్ఛను మరింత పెంచుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa