ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి టెస్ట్లో టీమిండియా ప్రస్తుతానికి వెనుకబడుతోంది. గురువారం ఓవల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఇప్పటివరకు 83 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్కు భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. జైస్వాల్ను అట్కిన్సన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయగా, రాహుల్ క్రిస్ వోక్స్ వేసిన బంతిని మిస్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ రాహుల్తో కలిసి జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో అంపైర్లు ముందస్తుగా లంచ్ బ్రేక్ ప్రకటించారు. అనంతరం వర్షం తగ్గిన తరువాత మ్యాచ్ పునఃప్రారంభమైంది.ఇక రెండో సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే శుభ్మన్ గిల్ నిరాశపరిచాడు. అతను అనవసరంగా రన్ తీసేందుకు ప్రయత్నించి రనౌట్గా వెనుదిరిగాడు. అట్కిన్సన్ వేసిన 28వ ఓవర్లో గిల్ ఆఫ్స్టంప్ వద్ద బంతిని డిఫెన్స్ చేశాడు. బంతి నేరుగా బౌలర్ చేతికి వెళ్లగా, గిల్ వెంటనే పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ సాయి సుదర్శన్ ‘రన్ వద్దు’ అని సూచించడంతో గిల్ యూటర్న్ తీసుకున్నాడు. తిరిగే క్రమంలో తడబడి స్లిప్ అయ్యాడు. ఈ అవకాశాన్ని వదలకుండా అట్కిన్సన్ నేరుగా వికెట్లు గిరాటేశాడు. దీంతో గిల్ (21) ఔట్ అయ్యాడు. మూడో వికెట్కు నమోదైన 44 పరుగుల భాగస్వామ్యానికి ముగింపు పలికింది.ఈ రనౌట్ టీమిండియాకు పేగిన రక్తంగా మారింది. గిల్ తీరు జట్టుపై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ దీనిపై స్పందిస్తూ — ‘‘ఇది సూసైడల్ రనౌట్. సగం పిచ్ దాటని గిల్ పరుగు పూర్తవుతుందని ఎలా అనుకున్నాడు?’’ అని తీవ్రంగా విమర్శించారు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ ఇంకా స్కోరు ప్రారంభించకముందే మళ్లీ వర్షం ఆటకు ఆటంకం కలిగించింది. మ్యాచ్ నిలిచే సమయానికి భారత్ 29 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో సుదర్శన్ (28 నాటౌట్), కరుణ్ నాయర్ (0 నాటౌట్) ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa