విధి చిన్నచూపు చూడటంతో ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులను ఆదుకునేందుకు.. వారికి అండగా నిలిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతూ ఉంటాయి. వారికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అయితే వాటిపై అవగాహన లేకపోవటంతోనే, ప్రచారం లేకపోవటమో తెలియదు కానీ దివ్యాంగులకు పూర్తిస్థాయిలో ఫలితాలు చేరడం లేదనేది కాదనలేని వాస్తవం. ఈ విషయాన్ని పక్కనబెడితే దివ్యాంగులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో.. వారికి ఉపయోగకరంగా ఉండే.. పరికరాలను ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లాలోని దివ్యాంగుల కోసం కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాన్పూర్ అలిమ్కో అనే కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ఉచితంగా పరికరాలు పంపిణీ చేస్తోంది.
దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ కోసం వైఎస్సార్ కడప జిల్లాలో మూడు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక శిబిరాలు ఆదివారం నుంచి మొదలయ్యాయి. ఆది, సోమ, మంగళవారం వరకూ ఈ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక శిబిరాలలో దివ్యాంగులు, వయోవృద్ధులను పరిశీలించి.. వారికి అవసరమైన సహాయ జీవన పరికరాలను ఉచితంగా అందిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి కోసం ఈ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేసి.. ఉచితంగా పరికరాలు అందిస్తారు.
ఇందులో భాగంగా ఆదివారం రోజున కడప అర్బన్, చింతకొమ్మదిన్నె మండలాలలోని దివ్యాంగుల కోసం కడపలోని శంకరాపురం ప్రభుత్వ అంధుల పాఠశాలలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. అలాగే పెండ్లిమర్రిలోని జిల్లా పరిషత్ హైస్కూలులో శిబిరం ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట జడ్పీ ఉన్నత పాఠశాల, సిద్ధవటం జడ్పీ ఉన్నత పాఠశాల, మైదుకూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, చెన్నూరు జిల్లాపరిషత్ హైస్కూల్లలో వైద్య బృందాలు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నాయి.
సోమవారం రోజున సింహాద్రిపురం జిల్లా పరిషత్ హైస్కూలు, తొండూరు జడ్పీ ఉన్నత పాఠశాల, వేంపల్లె జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, వీరపునాయునిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల, లింగాల జెడ్పీ హైస్కూల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే పులివెందుల ప్రభుత్వ మోడల్ పాఠశాలలో శిబిరం నిర్వహించనున్నారు.
మంగళవారం రోజున ఎర్రగుంట్ల జిల్లాపరిషత్ హైస్కూల్ , కమలాపురం ఎంపీయూపీ పాఠశాల, బద్వేల్ జిల్లా పరిషత్ హైస్కూల్, అట్లూరు జడ్పీ ఉన్నత పాఠశాల, పోరుమామిళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్, బ్రహ్మంగారి మఠం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. మూడేళ్ల కిందట ఇలా శిబిరాలు నిర్వహించి దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు పంపిణీ చేశారు. ఇప్పుడు మరోసారి అవకాశం వచ్చిందని.. దివ్యాంగులు ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa