ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ గ్రోత్ హబ్‌లో భాగంగా,,,ఏపీలోని ఆ 3 జిల్లాల్లో భూసమీకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 04:23 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు జిల్లాల పరిధిలో భూసమీకరణ చేపట్టనుంది. ఈ మేరకు ఆయా జిల్లాలలో భూసమీకరణ కోసం అధికారులు ప్రకటన కూడా విడుదల చేశారు. విశాఖపట్నం , అనకాపల్లి , విజయనగరం జిల్లాల పరిధిలో మొత్తం 1941.19 ఎకరాలు భూమిని సమీకరించనున్నారు. మొత్తం 13 గ్రామాల పరిధిలోని భూమిని ప్రభుత్వం సమీకరించనుంది. విశాఖ గ్రోత్ హబ్‌లో భాగంగా విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో ఈ భూసమీకరణ చేపట్టనున్నారు. విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) ఈ భూసమీకరణ ప్రక్రియను పర్యవేక్షించనుంది.


విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం, పద్మనాభం మండలాలోని గ్రామాలలో 1,132 ఎకరాలు భూమిని సమీకరించునున్నారు. అలాగే అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం, అనకాపల్లి మండలాలలో 783.69 ఎకరాలు భూమిని సమీకరిస్తారు. విజయనగరం జిల్లాలోని డెంకాడ, భోగాపురం మండలంలోని గ్రామాలలో 25.41 ఎకరాల భూసమీకరణకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లలో కొంత విస్తీర్ణం తిరిగి కేటాయించనున్నారు. 2016 వుడా భూసమీకరణ పథకం కింద భూసమీకరణ చేయనున్నారు. ఈ పథకం కింద ఎకరా డీపట్టా భూమిని తీసుకుంటే అందుకు బదులుగా అభివృద్ధి చేసిన 900 గజాల ప్లాట్లు వీఎంఆర్డీఏ అధికారులు రైతులకు అప్పగిస్తారు. అదే పదేళ్లకుపైగా ఆక్రమణలో ఉన్న భూములకు గానూ ఎకరాకు 450 గజాల ప్లాట్లు కేటాయిస్తారు.


మరోవైపు భూసమీకరణపై ఆయా గ్రామాల ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు గ్రామసభలు నిర్వహించనున్నారు. గ్రామసభలలో భూసమీకరణపై ప్రజల నుంచి అధికారులు సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. మరోవైపు భూసమీకరణపై ప్రకటన విడుదలైన నేపథ్యంలో 60 రోజుల్లోగా అంటే సుమారుగా రెండు నెలలోపు ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. ఆ అభ్యంతరాలు, వాటికి సంబంధించిన పత్రాలతో అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.


అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని గ్రామాలలో సెప్టెంబరు 4 నుంచి అక్టోబరు 3 వరకు గ్రామసభలు నిర్వహిస్తారు. అలాగే విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గిడిజాలలో సెప్టెంబరు 6న, గోరింటలో సెప్టెంబరు 9న, శొంఠ్యాంలో సెప్టెంబరు పదో తేదీన గ్రామసభలు నిర్వహిస్తారు. బీడీపాలెంలో సెప్టెంబరు 11న నిర్వహించనున్నారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కొవ్వాడలో సెప్టెంబరు 6వ తేదీన.. విజయనగరం జిల్లా డెంకాడ మండలం, భోగాపురం మండలంలోని గ్రామాలలో సెప్టెంబరు 4 నుంచి అక్టోబరు 3 మధ్య గ్రామసభలు జరగనున్నాయి. గ్రామసభలలో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల మీద అక్టోబరు 3 నుంచి 18వ తేదీ వరకూ ఆయా మండలాలో ఎమ్మార్వో కార్యాలయాల్లో విచారణ జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa