దేశ అభివృద్ధిలో జాతీయ రహదారులు కీలక పాత్ర పోషిస్తాయి. సరకు రవాణాతోపాటు ప్రజలు కూడా ఒకచోటు నుంచి మరో చోటుకు ప్రయాణించేందుకు నేషనల్ హైవేలు చాలా ముఖ్యం. అయితే నేషనల్ హైవేల నిర్మాణం, వాటి మెయింటెనెన్స్ కోసం జాతీయ రహదారులపై అక్కడక్కడా టోల్ గేట్లు ఏర్పాటు చేసి.. ఆ రోడ్డుపై ప్రయాణించినందుకు వాహనదారుల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేస్తూ ఉంటారు. వాహనదారుల వద్ద నుంచి టోల్ ఫీజులు వసూలు చేసినందుకు.. ఆ రోడ్డుపై ప్రయాణించేవారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎన్హెచ్ఏఐ ), సంబంధిత ఏజెన్సీలకు ఉంటుంది. కానీ సరైన సౌకర్యాలు కల్పించకపోతే.. ఆ మార్గంలో టోల్ ఛార్జీలు చెల్లించడం సరైంది కాదని తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
రహదారుల విషయంలో వాహనదారులకు సరైన సేవలు అందించకపోతే.. టోల్ రుసుం వసూలు చేయలేరని ఎన్హెచ్ఏఐ, సంబంధిత ఏజెన్సీలకు కేరళ హైకోర్టు తేల్చి చెప్పింది. ఎన్హెచ్-544 పై ఎడప్పల్లి-మన్నుతి మార్గంలో టోల్ ఛార్జీలు వసూలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ కేరళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎడప్పల్లి-మన్నుతి మార్గంలో ఫ్లై ఓవర్లు, డ్రైనేజీల వంటి నిర్మాణ పనులు పూర్తి కాలేదని.. మరోవైపు సర్వీస్ రోడ్డు సరిగా లేకపోవడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని కొందరు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్హెచ్-544పై ఉన్న పరిస్థితుల్లో టోల్ వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేరళ హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది.
పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ రహదారిపై ప్రయాణించినందుకు టోల్ చెల్లించాల్సిన బాధ్యత ప్రయాణికులపై ఉందని తెలిపింది. అదే సమయంలో నేషనల్ హైవేలపై వాహనదారులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎన్హెచ్ఏఐతోపాటు సంబంధిత ఏజెన్సీలపై ఉంటుందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్హెచ్ఏఐకి, వాహనదారులకు మధ్య మంచి నమ్మకంతో కూడిన సంబంధం ఉంటుందని.. అది చెడిపోయిన సమయంలో వాహనదారుల నుంచి టోల్ వసూలు చేసే హక్కును వారికి ఇవ్వలేమని కేరళ హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో ప్రజా ప్రయోజనాలను ఎన్హెచ్ఏఐ పట్టించుకోలేదని.. వాహనదారులు ఇచ్చిన ఫిర్యాదులను కూడా పెడచెవిన పెట్టిందని కోర్టు గుర్తుచేసింది.
అయితే ఈ పిటిషన్పై ఎన్హెచ్ఏఐ చేసిన వాదనలను కోర్టు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. టోల్ వసూలు చేయడం అనేది కాంట్రాక్టుకు సంబంధించిన విషయం అని.. దాన్ని అడ్డుకుంటే ఆయా చట్టాల కింద తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని ఎన్హెచ్ఏఐ వాదించింది. అయితే వాటిని ఖండించిన కోర్టు.. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన ఒప్పందాలు.. ప్రజల ప్రయోజనాలకు మించినవి ఏమీ కావని తేల్చి చెప్పింది. వాహనదారులకు సరైన సేవలు కల్పించకపోయినా.. కాంట్రాక్టు ఉందన్న కారణంతో టోల్ చెల్లించాలని వారిని బలవంతం చేయలేరని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఎడప్పల్లి-మన్నుతి మార్గంలో టోల్ వసూలు చేయడాన్ని 4 వారాల పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నాలుగు వారాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి కేరళ హైకోర్టు సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa