ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ పాదాలకు నమస్కరించిన యూఎస్ గాయని షాకింగ్ పోస్ట్

international |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 10:51 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత దేశంపై మరింతగా సుంకాలు పెంచుతామని బెదిరించిన నేపథ్యంలో.. అమెరికాన్ గాయని మేరీ మిల్బెన్ ఎక్స్ వేదికగా షాకింగ్ పోస్టు పెట్టారు. గతంలో ఆమె తన గాన ప్రతిభతో ప్రధాని మోదీని ఆకట్టుకుని, ఆయను పాదాలకు నమస్కరించిన మిల్బెన్.. తాజాగా ఇరు దేశాల నేతలకు కీలక సూచన చేశారు. అమెరికాకు భారత్ అవసరం ఉందని.. అలాగే భారత్‌కు అమెరికా అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ రెండు దేశాలు తమ సంబంధాలను కొనసాగించాలని.. అందుకోసం నిజమైన స్నేహితులుగా మారి చర్చించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.


భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడం ట్రంప్‌‌నకు ఏమాత్రం నచ్చడం లేదు. ఆ అక్కసుతోనే ఆయన భారత్‌పై 25 శాతం సుంకాలు సహా పెనాల్టీలు విధించారు. అయినప్పటికీ ఇండియా.. రష్యాతో వ్యాపారం చేస్తుండగా మరింత ఆగ్రహానికి గురైన అమెరికా అధ్యక్షుడు మంగళవారం రోజు హెచ్చరికలు జారీ చేశారు. 24 గంటల్లోగా భారత్ రష్యాతో వ్యాపారం ఆపకపోతే మరింత పెద్ద ఎత్తున సుంకాలు పెంచుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయినా భారత్ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ముఖ్యంగా హెచ్చరికలు జారీ చేసి రోజు కూడా గడవకముందే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో పర్యటిస్తున్నారు.


ఈక్రమంలోనే అనేక మంది నిపుణులు, అమెరికా నేతలు ఈ విషయంపై స్పందిస్తున్నారు. ట్రంప్ చేస్తున్న పని సరైనది కాదంటూనే తీరు మార్చుకోవాలని వివరిస్తున్నారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌ను విమర్శించడం సరికాదని.. అలా చేస్తే భారతదేశం లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలు దెబ్బతింటాయని ఆమె ట్రంప్‌కు గట్టిగా హెచ్చరించారు. చైనాకు మినహాయింపులు ఇస్తూ.. భారత్‌పై కఠినంగా వ్యవహరించడం దారుణం అన్నారు. ఇది జరిగిన కాసేపటికే ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ ఎక్స్ వేదికగా స్పందించారు.


భారత్-అమెరికా వాణిజ్య సుంకాల వివాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఇరు దేశాల నాయకులకు భావోద్వేగమైన విజ్ఞప్తి చేశారు. గతంలో 'జనగణమన' ఆలపించి, ప్రధాని నరేంద్ర మోదీ పాదాలకు నమస్కరించి వార్తల్లో నిలిచిన మిల్బెన్.. అమెరికాకు భారత్ అవసరం ఉందని.. అలాగే భారతదేశానికి అమెరికా అవసరం అని నొక్కి చెప్పారు. వ్యూహాత్మక కూటమిగా ఉన్న మన సంబంధాలను దెబ్బతీసే విధంగా తీసుకునే ఏ విధానం అయినా తప్పుడు దిశలో ప్రయాణించడమేనని ఆమె స్పష్టం చేశారు.


"టారిఫ్ యుద్ధం" పేరుతో జరుగుతున్న ఈ పోరాటం వల్ల ఇరు దేశాలలోని ఎన్నో చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆమె ఆవేదన చెందారు. తాను రోజూ వారితో మాట్లాడుతున్నానని.. వారి కష్టాలు తనకు పూర్తిగా తెలుసని అన్నారు. ఈ వివాదం సామాన్య ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియజేశారు. తన ప్రియతమ నాయకులైన అమెరికా అధ్యక్షులు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ఈ సుంకాలపై జరుగుతున్న తీవ్రమైన వాదోపవాదాలు తమందరినీ కలవరపెడుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఇరు దేశాల నేతలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa