ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం మధ్య బయటపడ్డ విభేదాలు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 11:32 PM

మహారాష్ట్రలో మరోసారి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. ఓ పదవికి అధికారి నియామకం విషయంలో ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) జనరల్ మేనేజర్ నియామకం విషయంలో ఫడ్నవీస్, షిండే‌లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం రెండు వేర్వేరు నియామక లేఖలను జారీ చేయగా.. ఒక్క పదవికి ఇద్దరు అధికారులను నియమించడం గమనార్హం.


షిండే అధ్వర్యంలోని పట్టణాభివృద్ధి శాఖ బెస్ట్ జనరల్ మేనేజర్‌గా అశ్విని జోషిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించగా... సీఎం ఫడ్నవీస్ అజమాయిషీలోని సాధారణ పరిపాలన శాఖ అశిష్ శర్మను అదే పోస్ట్‌లో నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ గందరగోళానికి కారణం ఏంటి? అని ఫడ్నవీస్‌ను అడిగితే ‘‘నేను బెస్ట్ విషయంలో నిర్ణయాలు తీసుకోను.. అది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది’ అని ఆయన అన్నారు. అయితే, పట్టణాభివృద్ధి శాఖ మాత్రం జోషి నియామకం గురించి అధికారిక ఉత్తర్వులు వెలువరించలేదని ప్రకటించింది.


ఈ గందరగోళంపై బెస్ట్ ఉద్యోగుల సంఘం కామ్‌గర్ సేన (యూబీటీ-శివసేన) తీవ్రంగా మండిపడింది. ఈ సంఘటన ఐఏఎస్ అధికారులలో తీవ్ర గందరగోళం, దివాలాస్థితి ఉన్న సంస్థ బాధ్యతలను చేపట్టడానికి ఉన్న అయిష్టతను ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించింది. ‘‘ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ అశ్విని జోషికి బెస్ట్ జనరల్ మేనేజర్‌గా అదనపు బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జీఎస్టీ కమిషనర్‌గా ఉన్న ఆశిష్ శర్మకు బెస్ట్ అదనపు బాధ్యతలను అప్పగించినా.. అదే రాత్రి ఆమె ఆ పదవి చేపట్టడానికి నిరాకరించినట్లు కనిపిస్తోంది’ అని కామ్‌గర్ సేనకు చెందిన సుహాస్ సమంత్ అన్నారు.


దీనిపై ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. తమ విశ్వాసపాత్రులను ఉన్నత పదవుల్లో నియమించే విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య గ్యాంగ్‌వార్ నడుస్తోందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ విమర్శించారు. ఒక పోస్ట్‌కు ఒకే రోజు ఇద్దరు వేర్వేరు అధికారులను నియమించడం చూస్తే మహాయుతి కూటమిలో అసమ్మతి ఏమేర ఉందో అర్ధమవుతుందని ఆయన ధ్వజమెత్తారు. డీసీఎం ఏక్‌నాథ్ షిండే వారంలో రెండోసారి ఢిల్లీకి వెళ్లడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రులపై ఫడ్రవీస్ నియంత్రణ పెంచడం, షిండే విధేయులపై చర్యలు తీసుకోవడం ఈ పర్యటనకు కారణమై ఉండొచ్చనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. సీఎం, డిప్యూటీ సీఎం మద్య సమన్వయం ఇప్పటికే లోపించిందని మాజీ మంత్రి, శివసేన (యూబీటీ) యువనేత ఆదిత్య ఠాక్రే దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa