ప్రస్తుత వివాహాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారతీయ వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులపై ఆవేదన వ్యక్తం చేశారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని అన్నారు.కానీ నేడు వివాహ వ్యవస్థపై నమ్మకం పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. కెమిస్ట్రీ బాగోలేదని విడాకులు తీసుకుంటున్నారని చలోక్తి విసిరారు. విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు.56 ఏళ్లుగా భాజపాకు సేవలందిస్తున్న సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభను విజయవాడలో నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఏ పని అయినా ఇష్టపడి చేస్తే కష్టం అనేది ఉండదని అన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన వారో స్పష్టంగా తెలియని స్థితి ఉందని వ్యాఖ్యానించారు.పార్టీ మారే నాయకుల పరిస్థితి బస్సుల రాకపోకల మాదిరిగా మారిపోయిందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీమన్నారాయణ చాలా మందికి ఆదర్శమని అన్నారు. జట్కా బండిపై తిరిగి వాజ్పేయి, అద్వానీ ప్రచారం చేసిన రోజుల్లో నుంచే శ్రీమన్నారాయణ భాజపా పదవుల ఆశ లేకుండా, కేవలం నిబద్ధతతో పని చేశారని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa