భారతదేశానికి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ తీవ్రంగా విమర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్ను విమర్శించడం సరికాదని.. అలా చేస్తే భారతదేశం లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలు దెబ్బతింటాయని ఆమె ట్రంప్కు గట్టిగా హెచ్చరించారు. చైనాకు మినహాయింపులు ఇస్తూ.. భారత్పై కఠినంగా వ్యవహరించడం అమెరికా విదేశాంగ విధానానికి మంచిది కాదని ఆమె అభిప్రాయ పడ్డారు.
రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ భారతదేశంపై తీవ్రమైన సుంకాలు విధిస్తానని హెచ్చరించిన కొన్ని గంటల తర్వాతే.. నిక్కీ హేలీ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తన వ్యాఖ్యలలో భారతదేశం ఒక "మంచి వ్యాపార భాగస్వామి కాదు" అని కూడా పేర్కొన్నారు. దీనిపై హేలీ స్పందిస్తూ.. "చైనా లాంటి శత్రు దేశానికి సుంకాల విషయంలో 90 రోజుల మినహాయింపు ఇచ్చి, బలమైన మిత్రదేశమైన భారత్తో సంబంధాలను చెడగొట్టుకోవడం సరికాదు" అని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. చైనా.. రష్యా, ఇరాన్ దేశాల నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేసే దేశమని, అయినా కూడా అమెరికా ఆ దేశం పట్ల మృదువైన వైఖరిని అవలంబిస్తోందని ఆమె గుర్తు చేశారు.
నిక్కీ హేలీ ట్రంప్ ప్రభుత్వంలో ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారిగా పని చేశారు. ఆమె ట్రంప్ పరిపాలనలో కేబినెట్ స్థాయి పదవిని చేపట్టిన మొదటి భారతీయ సంతతి వ్యక్తిగా చరిత్రకెక్కారు. అలాంటి వ్యక్తి ట్రంప్పై బహిరంగంగా విమర్శలు చేయడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది రిపబ్లికన్ పార్టీలో విదేశాంగ విధానం విషయంలో ఉన్న విభేదాలను కూడా సూచిస్తుంది. అయితే ట్రంప్ పర్యటనలు, ప్రచారాల్లో భారతదేశంపై ఇలాంటి విమర్శలు చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన భారత్పై టారిఫ్లు, వ్యాపార సంబంధాల విషయంలో అనేక విమర్శలు చేశారు.
అయితే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్కు అనివార్యమైంది. తక్కువ ధరలకు లభిస్తున్న చమురును కొనడం వల్ల భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకోగలుగుతోంది. ఈ వాస్తవాలను ట్రంప్ విస్మరిస్తున్నారని, చైనాతో పోలిస్తే భారత్ను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నిక్కీ హేలీ వ్యాఖ్యలు ఈ విశ్లేషణలకు బలం చేకూర్చాయి. భారత్ ఒక కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని, అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకోవాలంటే భారత్తో మంచి సంబంధాలు కొనసాగించడం అత్యవసరమని నిక్కీ హేలీ స్పష్టంగా వెల్లడించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa