ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూన్ త్రైమాసికంలో ఎస్‍బీఐకి రూ. 19,160 కోట్ల నికర లాభం

business |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 05:40 PM

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను రూ. 19,160 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు శుక్రవారం వెల్లడించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 12.5 శాతం అధికం. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ. 17,035 కోట్లుగా ఉంది.బ్యాంకు నిర్వహణ లాభం కూడా గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే 15.49 శాతం వృద్ధితో రూ. 30,544 కోట్లకు చేరినట్టు ఎస్‍బీఐ తెలిపింది. అయితే, రుణాలపై వచ్చే వడ్డీకి, డిపాజిట్లపై చెల్లించే వడ్డీకి మధ్య వ్యత్యాసమైన నికర వడ్డీ ఆదాయం  మాత్రం దాదాపు స్థిరంగా రూ. 41,072.4 కోట్ల వద్ద నిలిచింది.ఈ త్రైమాసికంలో ఎస్‍బీఐ ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడటం విశేషం. బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు  1.83 శాతానికి తగ్గగా, నికర నిరర్థక ఆస్తులు  0.47 శాతానికి పరిమితమయ్యాయి. మంచి రుణాలు మొండి బకాయిలుగా మారే రేటును సూచించే స్లిప్పేజ్ రేషియో కూడా 0.75 శాతానికి తగ్గింది. ఇది బ్యాంకు ఆర్థిక పటిష్ఠతకు సంకేతంగా నిలుస్తోంది.వివిధ రంగాలకు అందించే రుణాల్లోనూ బ్యాంకు బలమైన వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్‍ఎంఈ)కు ఇచ్చే రుణాలు వార్షిక ప్రాతిపదికన 19.10 శాతం పెరిగాయి. వ్యవసాయ రుణాలు 12.67 శాతం, రిటైల్ రుణాలు 12.56 శాతం చొప్పున వృద్ధి చెందాయి. కార్పొరేట్ రుణాలు 5.7 శాతం పెరిగాయి.మరోవైపు, బ్యాంకు వద్ద కరెంట్, సేవింగ్స్ ఖాతాల్లోని (కాసా) డిపాజిట్లు 8 శాతం పెరిగాయి. బ్యాంకు మొత్తం అడ్వాన్సులు రూ. 42.5 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఫలితాల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం బీఎస్‍ఈలో ఎస్‍బీఐ షేరు సుమారు రూ. 795.35 వద్ద ట్రేడ్ అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa