ప్రస్తుత రోజుల్లో మోసాలు, నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చివరాఖరుకు నీడను కూడా నమ్మలేని పరిస్థితి వచ్చేస్తోంది. నాలుగు రాళ్లు సంపాదించుకుందామనే ఆశతో.. రోడ్లపై తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాయి కొన్ని కుటుంబాలు. వ్యాపారం సక్రమంగా సాగితే తమ ఇంటిల్లిపాదీ నాలుగు మెతుకులు తినొచ్చనే ఆశ వారిది. కానీ కొంతమంది అత్యాశతో వారిని మోసగిస్తున్నారు. అలా మోసగించడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కైందో జంట. ఈ ఘటన గుంటూరులో కలకలం రేపింది. గుంటూరు నగరంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానిక వ్యాపారులను కలవరానికి గురి చేసింది. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని పట్టాభిపురం మెయిన్ రోడ్డు మీద ఉన్న తోపుడు బండ్ల వద్దకు గురువారం రాత్రి ఓ పురుషుడు, స్త్రీ బైక్ మీద వచ్చారు. అక్కడ తోపుడు బండి మీద వేరశెనక్కాయలు అమ్ముతున్న వ్యక్తి నుంచి వంద రూపాయలకు శనక్కాయలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత తమ వద్ద ఉన్న 500 రూపాయల నోటును తోపుడు బండి వ్యక్తికి ఇచ్చారు. అతను వంద రూపాయలు మినహాయించుకుని మిగతా చిల్లర 400 రూపాయలు తిరిగి వారికి చెల్లించాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న బెంగళూరు అయ్యంగార్ బేకరీకి వెళ్లిందీ జంట. కూల్ డ్రింక్ తీసుకుని మరో ఐదు వందల రూపాయల నోటును బేకరీ యజమానికి ఇచ్చారు. అయితే ఆ నోటును చేతిలోకి తీసుకోగానే.. ఎందుకే బేకరీ యజమానికి అనుమానం వచ్చింది. సాధారణ నోటుతో పోల్చితే పలుచగా అనిపించడంతో.. అతనికి అనుమానం వచ్చింది.
దీంతో దొంగనోటు అంటూ బేకరీ యజమాని కేకలు వేశాడు. దీంతో భయపడి పోయిన ఈ జంట యజమానికి ఇచ్చిన 500 రూపాయలు వెనక్కి తీసుకుని.. శనక్కాయల వ్యాపారి ఇచ్చిన వంద రూపాయలు ఇచ్చి వేగంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఈలోపే చుట్టూ ఉన్న జనం గుమికూడి వారిని కదలనివ్వకుండా చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అక్కడకు చేరుకుని విచారిస్తే వీరిద్దరూ రత్నగిరికాలనీలో ఓ అపార్టుమెంట్లో ఉండే గోపిరెడ్డి, జ్యోతిగా గుర్తించారు. తమకు హైదరాబాద్లో కన్సల్టెన్సీ ఉందని చెప్తూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో మరో వ్యక్తి వీరి బైక్ వద్ద బ్యాగ్ తీసుకుని పరారయ్యాడు. పోలీసులు గోపిరెడ్డి, జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa