ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్‌లో ఇథనాల్ కలిపితే వాహనాల మైలేజ్ తగ్గుతుందా.. నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్

national |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 09:09 PM

దేశంలో పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేందుకు.. కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల.. పర్యావరణానికి హాని జరగకుండా చూడటంతోపాటు పెట్రోల్ ధరలు కూడా దిగివస్తాయని.. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను వినియోగించినప్పుడు వాహనాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని ఇటీవలి కాలంలో జోరుగా చర్చ జరుగుతోంది. వాహనంలో సమస్యలు రావడమే కాకుండా మైలేజీ కూడా భారీగా తగ్గిపోతోందని.. నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే ప్రక్రియను ముందు నుంచి ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దీనిపై వస్తున్న వార్తలన్నీ అసత్యాలని ఇప్పటికే కొట్టిపారేసింది. తాజాగా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల సమస్యలు వచ్చిన వాహనాన్ని ఒక్కటైనా చూపించాలని సవాల్ చేశారు.


తాజాగా బిజినెస్ టుడే సంస్థ నిర్వహించిన ఒక సమ్మిట్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ గురించి సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్న ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో ఖండించారు. 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగించడం వాహనాలకు మంచిది కాదంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. అదంతా అవాస్తవమని స్పష్టత నిచ్చింది. అయినప్పటికీ ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఈ ప్రచారంపై స్పందించారు. ఎవరైతే ఇథనాల్ వినియోగంతో పెట్రోల్ వాహనాలకు మైలేజీ తక్కువ వస్తుందని పేర్కొంటున్నారో వారికి బహిరంగ సవాల్ విసిరారు. ఇథనాల్‌ కలిపిన పెట్రోల్ ఉపయోగించి మైలేజీ సమస్య వచ్చిన ఒక్క వాహనాన్నైనా చూపించాలని ఛాలెంజ్ చేశారు.


ఈ సదస్సులో ఇథనాల్‌ వల్ల సమస్య తలెత్తినట్లు నెట్టింట జరుగుతున్న ప్రచారంపై హోస్ట్ నితిన్‌ గడ్కరీని ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌‌ను కలిపితే వాహనాల మైలేజీ తగ్గుతోందనే వాదన ఏ రకంగానూ సరైంది కాదని తేల్చి చెప్పారు. దీనిపై చర్చించడం కూడా వృథా అంటూ కొట్టిపారేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలను కావాలనే కొన్ని పెట్రోలియం కంపెనీలు చేస్తున్న కుట్రలు కావచ్చని ఆయన అనుమానాలు వ్యక్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఈ20 పెట్రోల్‌ (E20 Petrol) కారణంగా సమస్య వచ్చినట్లు నిరూపించే ఒక్క వాహనాన్ని అయినా చూపించండని సవాల్ చేశారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం వల్ల ఎలాంటి సమస్య తలెత్తదని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.


కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ కలిపి.. వాహనాల్లో పోయాలని ఇటీవలి కాలంలో బాగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ-20 పెట్రోల్ పోయడం వల్ల పాత వాహనాల్లో సమస్యలు తెలుత్తుతున్నాయంటూ సోషల్ మీడియోల చర్చ జరుగుతోంది. ఇథనాల్‌ కలిసిన పెట్రోల్‌ వాడటం వల్ల మైలేజీ తక్కువగా వస్తుందనే వాదనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రచారంపై ఇప్పటికే స్పందించిన పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ.. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో వాహనాల్లో ఎలాంటి సమస్యలు రావని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఇథనాల్‌ వినియోగం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగ్గా ఉంటుందని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa