ఆపరేషన్ సిందూర్ సహా అనేక అంశాల్లో పార్టీ నిర్ణయాలకు విరుద్దంగా వ్యవహరించి.. అగ్రనాయకత్వంతో విబేధించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అనూహ్యంగా.. ఎన్నికల కమిషన్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. లోక్సభతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కేంద్ర ఎన్నికల కమిషన్ సహకరించి, అక్రమాలకు పాల్పడిందని, మీడియా ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రజంటేషన్ ఇచ్చి ఆరోపణలు విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మాజీ మంత్రి థరూర్ స్పందిస్తూ.. ఇది తీవ్రంగా చర్చించాల్సిన విషయం అని అన్నారు. అన్ని పార్టీలు, ఓటర్ల ప్రయోజనాలకు సంబంధించిన అంశమని అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ జాతికి సమాధానం చెప్పాలని ఆయన కోరారు.
‘‘ఇవి అన్ని పార్టీలు, ఓటర్ల అందరి ప్రయోజనాల దృష్ట్యా తీవ్రంగా పరిష్కరించాల్సిన తీవ్రమైన ప్రశ్నలు.. మన ప్రజాస్వామ్యం చాలా విలువైంది.. అసమర్థత, అజాగ్రత్త లేదా అంతకంటే దారుణమైన, ఉద్దేశపూర్వక తారుమారు ద్వారా దాని విశ్వసనీయతను నాశనం చేయడానికి ఇది అవకాశం కల్పిస్తుంది’’ అని కేంద్ర మాజీ మంత్రి, శశిథరూర్ పోస్ట్ చేశారు. అంతేకాదు, దీనిపై ఎన్నికల కమిషన్ అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. దాని అధికార ప్రతినిధి దేశానికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతినిధులు బృందాల్లో ఒకదానికి శశిథరూర్ నాయకత్వం వహించారు. ఈ విషయంలో అధిష్ఠానాన్ని ధిక్కరించడం కాంగ్రెస్తో సంబంధాలపై అనిశ్చితి నెలకుంది. ఈ తరుణంలో రాహుల్ గాంధీకి ఆయన మద్దతు లభించడం గమనార్హం. పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్పై చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికీ, థరూర్ దూరంగా ఉన్నారు. ఆపరేషన్ విజయవంతమైందనే తన వైఖరిని తాను వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు. దీంతో శశిథరూర్ కాంగ్రెస్ పార్టీని వీడతారంటూ ఊహాగానాలు కూడా వెలువడ్డాయి.
ఇక, ఎన్నికల కమిషన్పై ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ.. కర్ణాటక ఎన్నికల్లోనూ ఓట్ల చోరీకి పాల్పడిందని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో పలు స్థానాల్లో బీజేపీ గెలుపునకు సాయం చేసిందని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్.. ఏదైనా ఉంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించింది. లేకుంటే కేసులను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేకాదు, సవరించిన బిహార్ ఓటర్ల జాబితాను ఆగస్టు 1ను ప్రకటించినా... ఇంత వరకూ రాహుల్ గాంధీ ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని వ్యాఖ్యానించింది. అభ్యంతరాలకు ఎందుకీ జాప్యం అని ఈసీ నిలదీసింది. అలాగే, బిహార్ ఎన్నికల పూర్తయిన తర్వాత ఆయన అభ్యంతరాలు తెలుపుతారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa