ఆగస్టు 5న ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ధరాళీ గ్రామాన్ని ఖీర్ గంగానది వరద ముంచెత్తడంతో బురద, రాళ్లతో నిండిపోయింది. ఆ ప్రాంతంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం ద్వారా సంబంధాలు తెగిపోయి సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రోడ్డు మార్గంలో జేసీబీలను ఘటనా స్థలికి తరలించడం సాధ్యం కాకపోవడంతో ఆర్మీ సాహసం చేసింది. ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్ చినూక్ సాయంతో జేసీబీని అక్కడకు తరలించారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
క్లౌడ్బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి.. ఖీర్ గంగానది ధరాళీ గ్రామంపై విరుచుకుపడింది. ఛార్ధామ్లోని ఒకటైన గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాళీ.. అత్యంత సుందరమైన ప్రదేశం. గంగోత్రికి వెళ్లే ఛార్ధామ్ యాత్రికులు ఇక్కడ బస చేసి... విశ్రాంతి తీసుకుంటారు. ఈ గ్రామ సమీపంలో హోటళ్లు, రిసార్టులు, గెస్ట్హౌస్లు ఉంటాయి. ఇక, జలవిలయంలో 50 మందికిపైగా గల్లంతయ్యారు. ఆ ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారికంగా ఐదుగురు చనిపోయినట్టు ప్రకటించారు. కానీ, శిథిలాల కింద చాలామంది ఉన్నట్టు భావిస్తున్నారు. వారంతా ప్రాణాలతో ఉన్నారా? ప్రవాహంలో కొట్టుకుపోయారా? అనేది తెలియరాలేదు. నదికి కొద్ద దూరంలోని ఉన్న హర్షాలీ సైనిక క్యాంపు కూడా వరదల్లో కొట్టుకుపోగా.. అక్కడ ఉన్న 11 మంది జవాన్లు కొట్టుకుపోయారు.
కేరళకు చెందిన 28 మంది పర్యటకులు సైతం గల్లంతయ్యారు. మెరుపు వరదలకు కొద్ది గంటల ముందే వారు గంగోత్రికి బయలుదేరి వెళ్లినట్టు బంధువులు చెబుతున్నారు. కాగా, నాలుగు రోజుల నుంచి అక్కడ రెస్యూ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకూ 190 మందిని రక్షించాయి.
నది మహోగ్రరూపం దాల్చడంతో కేవలం 20 సెకెన్లలోనే గ్రామానికి గ్రామం తుడుచుపెట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొండల నుంచి లోయలోకి ప్రవహిస్తున్న ఖీర్ గంగా.. గ్రామానికి సమీపంలోని ఉండే మలుపు వద్దకు వచ్చేసరికి పక్కనే ఉన్న రక్షణ గోడను విరగ్గొట్టి నివాసాలను ముంచెత్తింది. వరద ఉద్ధృతిని ఎగువ ప్రాంతంలో ఉన్నవారు వీడియోలో బంధించారు. పరుగెత్తండి.. పరుగెత్తండి అంటున్న అరుపులో ఆ వీడియోల్లో వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇండియన్ ఆర్మీ స్పందించింది. పది నిమిషాల్లోనే 150 మంది సిబ్బందిని అక్కడకు పంపి రెస్యూ ఆపరేషన్ ప్రారంభించింది. పర్వత ప్రాంతాల్లో క్లౌడ్బరస్ట్లు సర్వసాధారణమే. కానీ, ధరాళీ వంటి పర్యాటక ప్రాంతంలో విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టి.. నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa