భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా జోక్యం చేసుకోవడంతో శాంతి ఒప్పందం సాధ్యమైందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనను పునరుద్ఘాటించారు. ట్రంప్ శాంతికి కట్టుబడి ఉన్నారని, ఆయన శాంతిదూత అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వాదనలను తీవ్రంగా ఖండించిన భారత్.. ఇరుదేశాల సైనిక చర్చల ద్వారానే కాల్పుల విరమణ సాధ్యమైందని తెలిపింది. మార్కో రూబియో 'ది వరల్డ్ ఓవర్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ట్రంప్ శాంతికి కట్టుబడి ఉన్నారని, శాంతికి మారుపేరుగా ఉండాలని అనుకుంటున్నారని చెప్పారు.
‘‘భారత్, పాకిస్థాన్ యుద్ధానికి దిగినప్పుడు మేము నేరుగా జోక్యం చేసుకుని.. అధ్యక్షుడు వారి మధ్య శాంతిని నెలకొల్పగలిగారు’ అని రూబియో అన్నారు. ట్రంప్ సహాకారంతో పలు వివాదాలు సమసిపోయాయని తెలిపారు. ‘‘కాంబోడియా- థాయిలాండ్ సరిహద్దు ఘర్షణ, అజర్బైజాన్, అర్మేనియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో-రువాండా (30 ఏళ్లు కొనసాగిన యుద్ధంలో మిలియన్ల మంది చనిపోయారు) వంటి వివాదాలను పరిష్కరించి.. శాంతి ఒప్పందాలు కుదిర్చాం.. ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు కొనసాగిస్తున్నాం’’ అని రూబియో తెలిపారు.
మే 10న భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై తొలుత ట్రంప్ ప్రకటన చేయగా.. తర్వాత కేంద్రం ధ్రువీకరించింది. అనేక సందర్భాల్లో ట్రంప్ తన వల్లే భారత్, పాకిస్థాన్ యుద్ధం ఆగిపోయిందని చెప్పుకున్నారు. రెండు దేశాలూ యుద్ధాన్ని ఆపితేనే వాణిజ్యం చేస్తామని చెప్పానని అన్నారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం భారత, పాక్ సైనికాధికారుల మధ్య చర్చల ద్వారా జరిగిందని, అమెరికా మధ్యవర్తిత్వం వల్ల కాదని న్యూఢిల్లీ స్పష్టం చేసింది.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ.. ‘‘సైనిక చర్య ఆగిపోవడానికి ఒత్తిడి కారణమని చెప్పడం పూర్తిగా నిరాధారమైంది’’ అని అన్నారు. ‘ రాజకీయ, సైనిక లక్ష్యాలన్నీ పూర్తిగా నెరవేరడంతో భారత్ ఆపరేషన్ సిందూర్ను నిలిపివేసింది’ అని ఆయన చెప్పారు. పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఒప్పందం కోసం వేడుకున్నారని’ ఆయన పేర్కొన్నారు.
దక్షిణాసియా వ్యవహారాల విశ్లేషకుడు మైఖేల్ కుగెల్మన్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణకు తాను క్రెడిట్ తీసుకోకుండా భారత్ అడ్డుపడటంతో ట్రంప్ కోపం ఒకింత ఆగ్రహానికి గురయ్యారని అన్నారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ అదనంగా 25 శాతం పన్నులు విధించారని తెలిపారు.
‘‘చైనా మాత్రం ట్రంప్ క్రెడిట్ తీసుకోవడానికి అడ్డు చెప్పలేదు.. భారత్ మాత్రం ట్రంప్తో ఫోన్లో మాట్లాడి, ఏం చేయాలో చెప్పింది. అందుకే ట్రంప్ భారత్పై కోపంగా ఉన్నారు’’ అని కుగెల్మన్ అన్నారు. రష్యా నుంచి చమురు తమ దేశ ప్రజల ఇంధన భద్రత కోసమేనని భారత్ ఉద్ఘాటించింది. ‘అమెరికా సుంకాలు ప్రకటన అన్యాయమైంది, సమర్థించలేనిది, అసమంజసమైనది’ అని పేర్కొంది. ఇతర దేశాలు కూడా ఇలా చేస్తున్నా, కేవలం తమపై మాత్రమే అదనపు సుంకాలు విధించడం చాలా దురదృష్టకరం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa