ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్‌లో ఇజ్రాయెల్ ఆయుధాలు వినియోగం.. నెతన్యాహు కీలక ప్రకటన

international |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 09:57 PM

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో డీఆర్డీఓతో సంయుక్తంగా అభివృద్ధి చేసిన బరాక్-8 క్షిపణులు, హార్పీ డ్రోన్లు సహా తమ ఆయుధాలను భారత్ ఉపయోగించిన విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు తాజాగా ధ్రువీకరించారు. ‘‘మేము గతంలో అందించిన ఆయుధ సామాగ్రి క్షేత్రస్థాయిలో చాలా బాగా పనిచేశాయి... మేము క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసిన ఆయుధాలు యుద్ధంలో పరీక్షకు గురవుతాయి’’ అని ఇజ్రాయెల్ ప్రధాని తెలిపారు. గాజాపై సైనిక దాడులను తీవ్రతరం చేసే ప్రణాళికను ఆవిష్కరించిన నెతన్యాహు.. ఆపరేషన్ సిందూర్‌లో భారత తమ ఆయుధాలను వినియోగించినట్టు వెల్లడించారు. ‘వారు బాగా పనిచేశారు... మాకు చాలా దృఢమైన పునాది ఉంది’ అని వ్యాఖ్యానించారు.


మే 7 నుంచి దాదాపు 100 గంటల వ్యవధిలో పాక్ క్షిపణులను తిప్పికొట్టడానికి భారత సైన్యం దేశీయంగా తయారు చేసిన ఆయుధ వ్యవస్థల శ్రేణితో పాటు బరాక్ క్షిపణులు, హార్పీ డ్రోన్‌లు.. రష్యాలో తయారు చేసిన S-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను భారత సైన్యం ఉపయోగించింది.


హర్పీ డ్రోన్లను రాడార్ వ్యవస్థలపై దాడి చేయడానికి రూపొందించారు. శత్రువు గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం లేదా SEAD పాత్రలో పనిచేసేలా డిజైన్ చేశారు. అధిక పేలుడు వార్‌హెడ్‌.. రేడియేషన్ ఎమిట్టింగ్, హైవెల్యూ టార్గెట్‌లను స్వయంప్రతిపత్తితో గుర్తించే ప్రత్యేక రాడార్‌ ఇందులో ఉంటుంది. పగటి సమయం లేదా రాత్రివేళలోనూ తొమ్మిది గంటల పాటు ఏకధాటిగా పనిచేయగలదు.


బరాక్-8 క్షిపణులు


ఇజ్రాయెల్, భారత్ (డీఆర్డీఓ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీర్ఘ-శ్రేణి, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి రక్షణ వ్యవస్థ ఇది. శత్రు విమానాలు సహా బహుళ వాయుమార్గాల ద్వారా వచ్చే ముప్పు ఎదుర్కొనేలా రూపొందించారు. దీని ప్రత్యేకతల్లో 360-డిగ్రీల కవరేజ్, బహుళ లక్ష్యాలను ఒకేసారి టార్గెట్ చేసుకునే సామర్థ్యం ఉన్నాయి. బరాక్ క్షిపణి వ్యవస్థను ఉపరితలం, నౌకల నుంచి ప్రయోగించవచ్చు. శత్రువుల ముప్పును గుర్తించి, నిరోధించడానికి క్రియాశీల రాడార్‌ను ఉపయోగిస్తుంది. 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది చేధించగలదు. ఇక, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఆపరేషన్ సిందూర్ భారత ఆత్మరక్షణ హక్కు.. దీనిపై మేము చాలా గర్వంగా ఉన్నామని భారత్‌లో ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ అన్నారు.


భారత్‌కు కీలక ఆయుధ సరఫరాదారు


భారత్‌కు పెద్ద మొత్తంలో ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలను సరఫరా చేసే దేశాల్లో ఇజ్రాయెల్ ముందువరుసలో ఉంది. గాజాతో యుద్ధం కొనసాగుతున్నా భారత్-ఇజ్రాయెల్ మధ్య వాణిజ్యం మాత్రం ఆగలేదు. గత దశాబ్దంలో ఇజ్రాయెల్ నుంచి రాడార్లు, డ్రోన్లు, మిసైల్స్ సహా భారత్ 3.9 బిలియన్ డాలర్లు విలువైన సైనిక హార్డ్‌వేర్‌లను దిగుమతి చేసుకుంది. గత పదేళ్లలో భారత్ ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో ఇజ్రాయెల్ నాలుగో స్థానంలో నిలిచింది. రష్యా (21.8 బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (5.2 బిలియన్ డాలర్లు), అమెరికా (4.5 బిలియన్ డాలర్లు)తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.


కానీ, విదేశాల నుంచి ఆయుధాల దిగుమతులపై ఆధారపడటాన్ని భారత్ క్రమంగా తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఆత్మనిర్బర్ భారత్ కింద దేశీయంగా ఆయుధాలను తయారుచేసుకుంటోంది. ఈ క్రమంలో 2015లో 1,940 కోట్లుగా ఉన్న భారత ఆయుద ఎగుమతులు.. 2025 నాటికి రూ.23,622 కోట్లకు చేరుకున్నాయి. దేశీయంగా తొలిసారి యుద్ధ నౌక ఐఎన్ఎష్ విక్రాంత్‌ను ఆవిష్కరించింది. అలాగే, స్వదేశీ పరిజ్ఞానంతో 5జీ యుద్ధ విమానం అభివృద్ధి చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa