ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల వేళ.. మరోసారి అమెరికాకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్

international |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 10:01 PM

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కేవలం రెండు నెలల వ్యవధిలో రెండోసారి అమెరికా పర్యటనకు వెళ్లడం అంతర్జాతీయ సంబంధాలలో ఒక కీలక పరిణామంగా మారింది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సైనిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది. ముఖ్యంగా ట్రంప్ భారత్‌పై సుంకాలను రెట్టింపు చేసిన మరుసటి రోజే.. ఆసిం మునీర్ అమెరికా సందర్శనకు వెళ్తుండగా అసలేం జరుగుతోందనే ఆలోచన అందరిలోనూ మొదలైంది. మరి ఈయన ఎందుకు యూఎస్ వెళ్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


జూన్ నెలలో తొలిసారి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మొదటిసారి అమెరికా వెళ్లగా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో ఏకాంతంగా భోజనం చేయడం ఒక అరుదైన సందర్భంగా నిలిచింది. ఇప్పటి వరకు ఏ పాకిస్థానీ సైనిక చీఫ్‌కు కూడా ఇలాంటి గౌరవం దక్కలేదు. ఆ సమయంలో ట్రంప్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా నివారించడంలో మునీర్ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. దీనికి ప్రతిగా మునీర్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు. అయితే ఈసారి మునీర్ అమెరికా పర్యటనకు ప్రధాన కారణం.. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైకేల్ కురిల్లా వీడ్కోలు సభకు హాజరుకావడమేనని తెలుస్తోంది.


జనరల్ కురిల్లా గతంలో పాకిస్థాన్‌ను ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఒక "అసాధారణ భాగస్వామి"గా అభివర్ణించారు. దీనికి గుర్తింపుగా పాకిస్థాన్ ప్రభుత్వం కూడా కురిల్లాకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'నిషాన్-ఎ-ఇంతియాజ్'ను అందించింది. ఈ పరిణామాలు పాకిస్థాన్-అమెరికా మధ్య పెరుగుతున్న సైనిక సహకారాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. మునీర్ పర్యటన జరుగుతున్న ప్రస్తుత సమయంలోనే అమెరికా-భారత్ మధ్య వాణిజ్య సుంకాలపై ఉద్రిక్తతలు పెరిగాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు గాను అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాలు విధించారు. దీంతో భారత్ ఉత్పత్తులపై మొత్తం సుంకం 50 శాతానికి పెరిగింది.


ఈ చర్యను భారత్ తప్పు పడుతోంది. తమ ఇంధన భద్రత కోసం మాత్రమే రష్యాతో వ్యాపారం చేస్తున్నట్లు వివరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఒక కొత్త వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా ప్రకటించింది. ఈ ఒప్పందం కింద పాకిస్థాన్ చమురు నిల్వలను అన్వేషించడానికి అమెరికా కంపెనీలకు అవకాశం కల్పించారు. అలాగే పాకిస్థాన్ ఉత్పత్తులపై గతంలో ఉన్న 29 శాతం సుంకాన్ని 19 శాతానికి తగ్గించారు. ఈ మొత్తం వ్యవహారం పాకిస్థాన్ అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్న తరుణంలో.. మునీర్ అమెరికా మద్దతును పొందడం ద్వారా తన సైనిక శక్తిని, రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa