ఐర్లాండ్లోని జాత్యహంకార దాడుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో దారుణం చోటు చేసుకుంది. కేవలం ఆరేళ్ల వయసు ఉన్న భారతీయ సంతతికి చెందిన ఓ బాలికపై యువకులు దాడి చేశారు. బయట ఆడుకుంటుండగా వచ్చి.. మీ దేశానికి వెళ్లిపో అంటూ ముఖంపై పిడి గుద్దులు గుద్దారు. ఒంటిపై కూడా ఇష్టం వచ్చినట్లుగా కొట్టగా.. ఎలాగోలా తప్పించుకున్న ఆమె ఇంట్లోకి పరుగులు పెట్టింది. విపరీతంగా ఏడుస్తూ, భయపడిపోతూనే అమ్మానాన్నలకు అసలు విషయం చెప్పింది.
కేరళలోని కొట్టాయంకు చెందిన నియా కుటుంబం.. ఎనిమిది సంవత్సరాలుగా ఐర్లాండ్లోని వాటర్ఫోర్డ్ సిటీలో నివసిస్తోంది. అయితే నియా పుట్టింది కూడా అక్కడే. ప్రస్తుతం ఆరేళ్ల వయసున్న నియా బుధవారం రోజు సాయంత్రం వేళ తన స్నేహితులతో కలిసి ఇంటి బయట ఆడుకుంటుండగా.. 12 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లల గుంపు ఆమె వద్దకు వచ్చారు. ఛీ నువ్వలా ఉన్నావేంటి, డర్టీ ఇండియన్ అంటూ తిట్టారు. అక్కడితో ఆగకుండా ఇండియాకి తిరిగి వెళ్లిపో అంటూ దూషించారు. ఆపై ఇష్టం వచ్చినట్లుగా బాలికపై దాడి చేశారు. ముఖంపై పిడి గుద్దులు గుద్దారు. సైకిల్తో ఢఈ కొట్టారు. అలాగే మెడపై కొట్టి జుట్టు కూడా పీకారు. అలాగే ఇతర చోట్ల కూడా దాడి చేశారు. దీంతో విపరీతంగా ఏడుస్తూనే నియా ఇంట్లోకి పరుగులు పెట్టింది.
గజగజా వణికిపోతూనే అక్కడ జరిగిన విషయాన్ని తన తల్లి అనుప అచ్చుతన్కు వివరించింది. నియా మాటలు తడబడుతుండగానే వెక్కివెక్కి ఏడ్చింది. ఆమెను ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తూనే.. బయటకు వెళ్లిన అనుప తన కుమార్తెపై దాడి చేసిన వారిని చూసింది. అప్పటికీ అక్కడే ఉన్న వాళ్లు నవ్వుతూ.. ఏమాత్రం తప్పు చేశామన్న భావనతో లేకుండా ఉండడం చూసి అనుప మరింత బాధ పడింది. వారికి ఏం చెప్పినా లాభం లేదనుకుని వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే తన బిడ్డపై దాడి చేసిన వారికి శిక్ష విధించడం కంటే కూడా కౌన్సిలింగ్ ఇవ్వడమే మంచిదని ఆమె పోలీసులతో చెప్పడం గమనార్హం.
అయితే ఓ నర్సుగా తాను ఎనిమిది సంవత్సరాలుగా ఐర్లాండ్లో ప్రజలకు సేవలు అందిస్తున్నానని.. ఐరిష్ పౌరసత్వం కూడా పొందినప్పటికీ తన పిల్లలు కూడా సురక్షితంగా లేరన్న భావన తనను తీవ్రంగా కలిచి వేస్తోందని వివరించింది. ఈ సంఘటన ఐర్లాండ్లో భారతీయ సమాజం ఎదుర్కొంటున్న జాతి వివక్ష సమస్యను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో డబ్లిన్లో కూడా భారతీయులపై అనేక దాడులు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ఈ పెరుగుతున్న జాత్యహంకార దాడుల దృష్ట్యా.. డబ్లిన్లోని భారత రాయబార కార్యాలయం ఐర్లాండ్లో ఉన్న భారతీయ పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa