2022 మార్చిలో వివాహం జరిగిన ఓ జంట మధ్య సంబంధం కొన్ని నెలల్లోనే ఒడిదొడుకులకు లోనైంది. భర్త, అతని కుటుంబ సభ్యులు తనను మానసికంగా, శారీరకంగా వేధించారని భార్య ఆరోపించింది. భర్త మానసిక ఆరోగ్యం గురించి వివాహానికి ముందు దాచారని, తనను అవమానించారని, రూ. 15 లక్షలు డిమాండ్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలతో ఆమె పుండ్లిక్ నగర్ పోలీస్ స్టేషన్లో భర్త, అత్తమామలపై సెక్షన్ 498-ఎ సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.
బాంబే హైకోర్టు ఈ కేసును విచారించిన జస్టిస్ విభా కంకన్వాడి, జస్టిస్ సంజయ్ దేశ్ముఖ్ల ధర్మాసనం ఆరోపణలను పరిశీలించింది. భార్య చేసిన ఆరోపణలు “సాధారణమైనవి, అస్పష్టమైనవి”గా ఉన్నాయని, వాటికి సరైన సాక్ష్యాలు లేవని గుర్తించింది. భర్త వంట బాగా చేయడం లేదని, సరైన దుస్తులు ధరించడం లేదని చేసిన వ్యాఖ్యలు సెక్షన్ 498-ఎ కింద క్రూరత్వంగా పరిగణించబడవని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, భర్త ఆరోగ్య పరిస్థితి గురించి వివాహానికి ముందే చాట్ రికార్డుల ద్వారా భార్యకు తెలిసినట్లు కోర్టు గమనించింది.
కోర్టు మరో కీలక అంశాన్ని హైలైట్ చేసింది. సంబంధాలు ఒడిదొడుకులకు గురైనప్పుడు, ఆరోపణలు తరచూ అతిశయోక్తిగా ఉంటాయని, ఇవి చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేసేలా చేస్తాయని పేర్కొంది. ఈ కేసులో భార్య ఆరోపణలకు సమర్థనీయమైన ఆధారాలు లేనందున, భర్త, అతని కుటుంబ సభ్యులపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనితో, ఈ ఆరోపణలు చట్టపరమైన క్రూరత్వం కిందకు రావని, విచారణకు వెళ్లడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని కోర్టు తేల్చిచెప్పింది.
ఈ తీర్పు వైవాహిక వివాదాల్లో తప్పుడు ఆరోపణలు, అస్పష్టమైన ఫిర్యాదులపై చట్టపరమైన వ్యవస్థను దుర్వినియోగం చేయడం గురించి మరోసారి చర్చకు దారితీసింది. భార్య చేసిన ఆరోపణలు సాధారణ గృహ సమస్యలకు సంబంధించినవేనని, అవి క్రిమినల్ కేసుగా మలచడం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు, వివాహ సంబంధాల్లో ఆరోపణలు చేసే ముందు ఆధారాల పటిష్టతపై దృష్టి పెట్టాలని సూచిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa