ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్విట్ ఇండియా ఉద్యమం యువతకు ఆదర్శం కావాలి.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

national |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 01:12 PM

స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, నేటి యువత ఆ ఉద్యమ పాఠాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1942లో బ్రిటిష్ వలస పాలకులను భారతదేశం నుంచి వెళ్ళగొట్టే లక్ష్యంతో మహాత్మా గాంధీ “డూ ఆర్ డై” నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి మలుపు తిప్పిన ఘటనగా అభివర్ణించారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రను తిరగరాయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ పాత్రను, నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి నేతల కృషిని చరిత్ర నుంచి తొలగించేందుకు బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు.
ఇప్పటివరకు మనం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యవస్థను కూడా మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆయన హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతకు స్వాతంత్ర్య పోరాట చరిత్రపై అవగాహన కలగడం ఎంతో అవసరమని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa