భారత రాజధాని ఢిల్లీని శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తుండగా, ట్రాఫిక్ స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం ధాటికి నగర వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.
ఈ వర్షాల ప్రభావంతో జైత్పూర్లో శనివారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ గోడ కూలిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో కొంతమంది శిథిలాల కింద చిక్కుకోగా, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన నగరంలోని భద్రతా వైఫల్యాలను, మౌలిక సదుపాయాల లోపాలను మరోసారి బహిర్గతం చేసింది.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమై, నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో జల నిర్వహణ, రక్షణ చర్యలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అత్యవసరం కాని పక్షంలో బయటకు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa