ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల తరహాలో,,,,రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 07:37 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ప్రధాన ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ నిషేధించింది. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయాలలో ఇకపై 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వులలో దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కాటన్, పేపర్ బ్యాగులు ఉపయోగించాలని ఏపీ దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. అలాగే అరిటాకులు, స్టీల్ ప్లేట్లలోనే భక్తులకు అన్నప్రసాదం వడ్డించాలని సూచించింది. స్టీల్ మగ్గులు, గ్లాసులు కూడా అందుబాటులో ఉంచాలంటూ ఉత్తర్వులలో స్పష్టం చేసింది.


ఆలయాలలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, బాటిళ్లు, డిస్పోజబుల్ ప్లేట్లు, కప్పులు, ఇతరత్రా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ మీద నిషేధం అమల్లో ఉంటుంది. వీటి స్థానంలో పర్యావరణహితమైన క్లాత్ బ్యాగులు, స్టీల్ టంబ్లర్లు, అరిటాకులు, పేపర్ బ్యాగులు ఉపయోగించాలని సూచించింది. అలాగే ప్రసాదాలను స్టీల్ ప్లేట్లు లేదా అరిటాకులలో మాత్రమే భక్తులకు అందించాలి. తీసుకువెళ్లేందుకు ప్లాస్టిక్ కవర్లు కాకుండా పేపర్ బ్యాగులు వినియోగించాలి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పద్ధతులను అనుసరించాలి. టీటీడీ ఇప్పటికే బయోడీగ్రేడబుల్ లడ్డూ కవర్లు ఉపయోగిస్తోంది. ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని నిషేధించింది.


ఇక తొలివిడతలో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నెలవైన కనకదుర్గ ఆలయంలో ఈ నిషేధం అమలు చేయనున్నారు. ఆ తర్వాత మరో వంద ఆలయాలకు విస్తరించే ఆలోచనలో ఏపీ దేవాదాయ శాఖ ఉంది. ఇక ఆలయాల ప్రాంగణంలో ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గి, పర్యావరణహిత ఆధ్యాత్మిక పర్యాటకం, సంప్రదాయ పద్ధతులను ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.


మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ప్లాస్టిక్ నిషేధించాలని 2022 జూలైలోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. క్లీన్ ఏపీ కార్యక్రమంలో భాగంగా ఏపీ మున్సిపల్ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కనకదుర్గమ్మ ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలం ఆలయం, ద్వారకా తిరుమల ఆలయం, కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గుడి, శ్రీశైలంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa