ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మతం దాచి పెళ్లి చేసుకుంటే 10 ఏళ్ల జైలు శిక్ష.. మతమార్పిడులపై అమల్లోకి కఠిన చట్టం

national |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 08:03 PM

వ్యక్తుల మతస్వేచ్ఛ, మతాంతర వివాహాలు, మత మార్పిడులకు సంబంధించి.. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా సంచలన ఆదేశాలు వెలువరించింది. మతమార్పిడుల నిరోధక చట్టం 2022 ప్రకారం.. మతాన్ని దాచి, మతం చెప్పకుండా.. పెళ్లి చేసుకునేవారిని కఠినంగా శిక్షించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మతమార్పిళ్ల నిరోధక చట్టం 2022 అమలుకు సంబంధించి.. దాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానాలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే మతాంతర వివాహాలపైనా నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.


వ్యక్తులు తమకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని పేర్కొన్న హర్యానా ప్రభుత్వం .. కానీ బలవంతంగా మతం మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే పెళ్లి కోసం మాత్రమే జరిగే మతమార్పిడిని ఈ మతమార్పిడుల నిరోధక చట్టం 2022 నిరోధిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నిబంధనను ఎవరైనా అతిక్రమిస్తే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.4 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు తేల్చి చెప్పింది.


ఈ చట్టం ప్రకారం మతం మారాలి అనుకునేవారు మతమార్పిడి కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని.. ఆ తర్వాత నిర్ణీత గడువు వరకు వేచి చూడాల్సి ఉంటుందని హర్యానా సర్కార్ వెల్లడించింది. మోసపూరితంగా, బలవంతంగా చేసే మతమార్పిళ్లను రద్దు చేయనున్నట్లు తెలిపింది. వ్యక్తులకు ఉన్న మతస్వేచ్ఛను అడ్డుకోవడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని.. అయితే ఈ కారణాన్ని చూపించి జరిగే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యమని స్పష్టం చేసింది. ఇలాంటి కఠిన చట్టాలను పక్కాగా అమలు చేయడం వల్ల.. ఉద్దేశపూర్వకంగా జరిపే మత మార్పిడులకు అడ్డుకట్ట వేయవచ్చని హర్యానా సర్కార్ తేల్చి చెప్పింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa