వ్యక్తుల మతస్వేచ్ఛ, మతాంతర వివాహాలు, మత మార్పిడులకు సంబంధించి.. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా సంచలన ఆదేశాలు వెలువరించింది. మతమార్పిడుల నిరోధక చట్టం 2022 ప్రకారం.. మతాన్ని దాచి, మతం చెప్పకుండా.. పెళ్లి చేసుకునేవారిని కఠినంగా శిక్షించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మతమార్పిళ్ల నిరోధక చట్టం 2022 అమలుకు సంబంధించి.. దాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానాలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే మతాంతర వివాహాలపైనా నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
వ్యక్తులు తమకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని పేర్కొన్న హర్యానా ప్రభుత్వం .. కానీ బలవంతంగా మతం మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే పెళ్లి కోసం మాత్రమే జరిగే మతమార్పిడిని ఈ మతమార్పిడుల నిరోధక చట్టం 2022 నిరోధిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నిబంధనను ఎవరైనా అతిక్రమిస్తే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.4 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు తేల్చి చెప్పింది.
ఈ చట్టం ప్రకారం మతం మారాలి అనుకునేవారు మతమార్పిడి కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని.. ఆ తర్వాత నిర్ణీత గడువు వరకు వేచి చూడాల్సి ఉంటుందని హర్యానా సర్కార్ వెల్లడించింది. మోసపూరితంగా, బలవంతంగా చేసే మతమార్పిళ్లను రద్దు చేయనున్నట్లు తెలిపింది. వ్యక్తులకు ఉన్న మతస్వేచ్ఛను అడ్డుకోవడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని.. అయితే ఈ కారణాన్ని చూపించి జరిగే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యమని స్పష్టం చేసింది. ఇలాంటి కఠిన చట్టాలను పక్కాగా అమలు చేయడం వల్ల.. ఉద్దేశపూర్వకంగా జరిపే మత మార్పిడులకు అడ్డుకట్ట వేయవచ్చని హర్యానా సర్కార్ తేల్చి చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa