ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్‌ గురించి ఎయిర్‌ఫోర్స్ చీఫ్ సంచలన విషయాలు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 07:59 PM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఘటనకు ప్రతీకారంగా.. పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లినట్లు భారత వైమానిక దళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన 16వ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కాత్రే స్మారక ఉపన్యాసంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సంచలన వివరాలను తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా చేపట్టిన సైనిక చర్యలో మొత్తం 5 పాకిస్తానీ యుద్ధ విమానాలతోపాటు.. ఒక భారీ విమానాన్ని కూల్చివేసినట్లు స్పష్టం చేశారు.


ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా గాలిలో ప్రయాణిస్తున్న ఆరు పాకిస్తాన్ విమానాలను ధ్వంసం చేసినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడించారు. వీటితోపాటు భూమిపై ఉన్న మరో 2 విమానాలను కూడా భారత వైమానిక దళాలు నాశనం చేసినట్లు తాజాగా వివరించారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్లే ఈ కీలక విజయాలు సాధ్యమైనట్లు వెల్లడించారు. ఈ వైమానిక రక్షణ వ్యవస్థ.. పాకిస్తాన్ విమానాలను గుర్తించి.. వాటిని నిర్వీర్యం చేయడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేసిందని గుర్తు చేశారు.


ఇక భారత వైమానిక దళం దాడిలో కూల్చివేసిన భారీ విమానం ఒక ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (AWACS ) లేదా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ అయి ఉండొచ్చని భావిస్తున్నట్లు భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ స్పష్టం చేశారు. ఇలాంటి అత్యంత కీలకమైన విమానాన్ని ధ్వంసం చేయడం వల్ల.. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.


భారత సైన్యం.. పాకిస్తాన్ బహవల్పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్స్‌ను ధ్వంసం చేశాయని వెల్లడించిన ఏపీ సింగ్.. వాటికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా చూపించారు. దాడులకు ముందు ఎలా ఉన్నాయో.. దాడులు చేసిన తర్వాత ఆ భవనాలు ఎంతలా ధ్వంసం అయ్యాయో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఉగ్రస్థావరాలను పక్కాగా టార్గెట్ చేసుకుని జరిపిన దాడుల్లో.. పక్కనే ఉన్న ఇతర భవనాలకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకున్నట్లు తెలిపారు.


జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ వద్ద ఏప్రిల్ 22వ తేదీన జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం.. దేశవ్యాప్తంగానే కాకుండా పలు దేశాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఈ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత సైన్యం మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టి.. పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. ఈ దాడుల్లో పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 100 మందికి పైగా టెర్రరిస్ట్‌లను మట్టుబెట్టినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa