ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యప్రదేశ్‌లో బంగారు నిల్వలు,,,100 హెక్టార్లలో లక్షల టన్నుల పసిడి నిల్వలు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 08:14 PM

మిగతా ప్రపంచ దేశాల సంగతి తెలియదు కానీ.. భారతీయులకు బంగారమంటే అమితమైన మోజు. పండగ, పబ్బం, ఆఖరికి ఎంత చిన్న కార్యం చేసినా సరే ఎంతో కొంత బంగారం కొనడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక ఇంట్లో ఆడపిల్ల ఉంటే.. పాప పుట్టిన దగ్గర నుంచే బంగారం కొని దాస్తుంటారు. ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత విలువ, మర్యాద అని భావిస్తారు. భారతీయులతో అతంటి అనుబంధాన్ని పెనవేసుకున్న పసిడి ధరలు గత కొంత కాలంగా రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు చేరువయ్యిందంటే పుత్తడి డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో బంగారం కొనుగోళ్లు భారీగా సాగుతుంటాయి. అయితే మనం విదేశాల నుంచి పసిడిని దిగుమతి చేసుకుంటాం.. కనుక ధర ఎక్కువ. అదే మన దగ్గరే బంగారం లభ్యం అయితే.. అప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..


భారతదేశంలో బంగారం నిల్వలు గుర్తించారా అంటే అవుననే అంటున్నారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన జియాలజిస్టులు. దేశంలోని ఓ రాష్ట్రంలో భారీ ఎత్తున బంగారం నిల్వలు గుర్తించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వార్తల సారాంశం ఏంటంటే.. ఇనుప ఖనిజానికి నెలవైన మధ్యప్రదేశ్‌లో తాజాగా బంగారు నిల్వలను కూడా గుర్తించారని.. అది కూడా 100 హెక్టార్ల భూమిలో అంటూ ప్రచారం జరుగుతోంది.


మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పూర్‌ జిల్లాలో జీఎస్ఐకు చెందిన జియాలజిస్టులు బంగారం నిక్షేపాలను గుర్తించారని.. అది కూడా గ్రాములు, కిలోగ్రాముల్లో కాకుండా.. ఏకంగా టన్నుల కొద్దీ బంగారం నిల్వలను కనుగొన్నారని వార్తలు వస్తున్నాయి. జబల్‌పూర్‌ జిల్లాలోని మహాగ్వాన్‌ కియోలరి ప్రాంతంలో దాదాపు 100 హెక్టార్ల భూమిలో లక్షల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని గుర్తించారని సమాచారం. జీఎస్ఐ శాస్త్రవేత్తలు ఇక్కడి మట్టి నమూనాలను పరీక్షించి, రసాయన విశ్లేషణలు చేశాక ఈ విషయాన్ని నిర్ధారించారని ప్రచారం జరుగుతోంది.


అలానే ఇక్కడ బంగారంతో పాటు రాగి, ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయని తెలిపారు. దీనితో మధ్యప్రదేశ్ రాష్ట్రం మైనింగ్ రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవనుందని అభిప్రాయపడుతున్నారు. అయితే జీఎస్ఐ జియాలజిస్టులు మాత్రం బంగారం నిల్వలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. కానీ 100 హెక్టర్ల భూమిలో అని ఎక్కడా తేలలేదు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నాము అని తెలిపారు.


మహాగ్వాన్‌ కియోలరి ప్రాంతంలో ఇదివరకే ఇనుము, మాంగనీసు నిల్వలను గుర్తించారు. ఇక్కడ లభించే ఖనిజాలను చైనా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు బంగారం నిల్వలు కూడా బయటపడటంతో మధ్యప్రదేశ్ దశ తిరుగుతుందని భావిస్తున్నారు. జీఎస్ఐ శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. ఖనిజ నిక్షేపాల కోసం ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో భాగంగా చేసిన మట్టి నమూనా పరీక్షలు, రసాయన విశ్లేషణల ద్వారా ఇక్కడ పసిడి నిల్వలపై స్పష్టమైన అంచనాకు వచ్చాము అని జాతీయ మీడియాకు తెలిపారు.


మధ్యప్రదేశ్‌లో బంగారం నిక్షేపాలు బయటపడటం ఇదే మొదటిసారి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం కత్నీ జిల్లాలో కూడా పెద్ద మొత్తంలో బంగారు నిల్వలను గుర్తించారు. ఇప్పుడు మరోసారి భారీగా బంగారం బయటపడటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa