ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎం కిసాన్ సాయం వచ్చి, అన్నదాత సుఖీభవ రాలేదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 10, 2025, 06:05 PM

రైతన్నలకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న నంగతి తెలిసిందే. కేంద్రం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ.20 వేలు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా ఆగస్ట్ నాలుగో తేదీ అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వారణాసిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ యోజన పథకం కింద అర్హులైన రైతులకు రూ.2000 చొప్పున బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. ఇక అదే రోజున ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధులు విడుదల చేశారు. సుమారుగా 46 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.5000 చొప్పున జమ చేశారు.


అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేసినప్పటికీ కొంతమంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ కాలేదు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పథకం కింద సాయం అందలేదు. అలాగే కొంతమంది రైతులకు పీఎం కిసాన్ యోజన కింద రూ.2000 పడినప్పటికీ.. అన్నదాత సుఖీభవ పథకం కింద అందించే రూ.5000 సాయం అందలేదు. దీంతో అలాంటి వారంతా ఆందోళన చెందుతున్నారు. తమకు సాయం అందదేమోననే సందేహంలో ఉన్నారు. అయితే సాంకేతిక సమస్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రైతులు సకాలంలో ఈకేవైసీ పూర్తి చేయకపోవటం, అలాగే రైతుల బ్యాంక్ ఖాతాలు యాక్టివ్‌గా లేకపోవటం, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పెండింగ్ ఉండటం వీటికి కారణాలుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.


ఈకేవైసీ పెండింగ్, బ్యాంక్ అకౌంట్ సమస్యలు, భూమికి సంబంధించిన యజమాని మరణం, భూ హక్కుల బదలాయింపులో సమస్యలు, ఆధార్ కార్డుకు భూమికి అనుసంధానం కాకపోవటం వంటి సమస్యలతో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పొందలేని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పథకానికి తాము అర్హులమేనని నిరూపించే పత్రాలతో రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి. దరఖాస్తుకు ఆ పత్రాలను జతచేసి అధికారులకు సమర్పించాలి. అధికారులు అర్హతా ప్రమాణాలను పరిశీలించి.. అర్హత ఉంటే లబ్ధిదారుల జాబితాలో చేర్చుతారు. ఆ తర్వాత వారి అకౌంట్లలోకి డబ్బులు జమ కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa