నేటి స్వార్థపూరిత ప్రపంచంలో కూడా మానవత్వం, దాతృత్వం ఇంకా సజీవంగా ఉన్నాయని నిరూపించే ఓ సంఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో వెలుగుచూసింది. ఒక వృద్ధ యాచకురాలు తన ఆరేళ్ల కష్టార్జితమైన రూ. 1.83 లక్షలను స్థానిక హనుమాన్ ఆలయం పునరుద్ధరణ కోసం విరాళంగా ఇచ్చి గ్రామస్థులు అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆమె చేసిన ఈ మహాదానం గురించి తెలిసిన వారందరూ ఆమె దాతృత్వాన్ని ప్రశంసిస్తున్నారు.
రాయచూర్ జిల్లాలోని బిజనగేర గ్రామంలో కొంతమంది దాతల సహకారంతో శిథిలావస్థలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని పునరుద్ధరించడానికి గ్రామస్థులు నిధులు సేకరించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే దాదాపు 60 ఏళ్ల వయసున్న ఆ వృద్ధ యాచకురాలు గ్రామ పెద్దలను సంప్రదించి.. గుడి నిర్మాణానికి తాను కూడా సహాయం చేస్తానని చెప్పింది. అందుకు అంగీకరించాలని కోరింది. అయితే ఆమె భిక్షం చేసుకుంటూ జీవించడంతో.. ఆమె వద్ద డబ్బులు ఉండవని భావించిన గ్రామస్థులు ఆమె మాటలను పట్టించుకోలేరు. వద్దమ్మా.. నీ దగ్గర ఎక్కువ ఉండవు, వెళ్లు అని చెప్పారు. కానీ ఆమె మాత్రం లేదు నా దగ్గర పెద్ద మొత్తంలోనే డబ్బులు ఉన్నాయని చెప్పి.. తన సంచిలో ఉన్న డబ్బును బయటకు తీసి.. గుడి కమిటీ సభ్యులకు చూపించింది.
వారు ఆ డబ్బును చూసి షాక్ అయ్యారు. ఆ డబ్బునంతా లెక్కపెట్టగా.. మొత్తం రూ. 1.83 లక్షలు ఉన్నట్లు తేలింది. వృద్ధురాలు గత ఆరు సంవత్సరాలుగా భిక్షాటన ద్వారా సంపాదించిన ప్రతి పైసాను జాగ్రత్తగా దాచిపెట్టుకుందని తెలిసింది. ఆమె ఆ డబ్బును జాగ్రత్తగా గోనె సంచులలో దాచి పెట్టుకున్నట్లు గ్రామస్థులు గుర్తించారు. తాను జీవితాంతం కూడబెట్టిన ఈ సొమ్మును ఆలయం కోసమే ఉంచానని, భగవంతుడికి సేవ చేయడం తన భాగ్యమని ఆమె చెప్పింది. ఆమె నిస్వార్థ భక్తి, దానగుణం చూసి గ్రామస్థులందరి కళ్లు చెమర్చాయి.
భిక్షాటనతో జీవితం గడిపే ఒక వృద్ధురాలు ఇంత పెద్ద మొత్తాన్ని దానం చేయడం సమాజంలో దాతృత్వం ఇంకా బతికే ఉందని రుజువు చేస్తోందని గ్రామస్థులు అంటున్నారు. ముఖ్యంగా ధనవంతులు కూడా పెద్దగా విరాళాలు ఇవ్వడానికి వెనకాడుతున్న ఈ రోజుల్లో.. ఆమె చేసిన పని ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఆమె దానం చేసిన డబ్బుతో గుడి పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేయాలని గ్రామ కమిటీ నిర్ణయించింది. ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా గుడిలో ఆమె పేరును కూడా చెక్కుతామని గ్రామస్థులు హామీ ఇచ్చారు. యాచకురాలు చేసిన పని గురించి స్థానిక పత్రికల్లో కూడా ప్రచురితమైంది. ఇది చూసి చాలా మంది ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa