ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాను ఆక్రమించడం కాదు.. విముక్తి ప్రసాదించడమే లక్ష్యం: నెతన్యాహు

international |  Suryaa Desk  | Published : Sun, Aug 10, 2025, 07:57 PM

అక్టోబర్ 7వ తేదీన జరిగిన హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్ సైనిక చర్యలపై అంతర్జాతీయంగా, దేశీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన దేశం సైనిక ప్రణాళికలను గట్టిగా సమర్థించుకున్నారు. తమ లక్ష్యం గాజాను శాశ్వతంగా ఆక్రమించడం కాదని.. హమాస్ పాలన నుంచి దానికి విముక్తి కల్గించడమని చెప్పారు. అలాగే అక్కడ శాంతియుత పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో జరిపిన ఫోన్ సంభాషణలో వెలువడింది.


ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ ఇటీవల గాజా నగర నియంత్రణకు ఒక కొత్త సైనిక ప్రణాళికను ఆమోదించిన తర్వాత విమర్శలు మరింత పెరిగాయి. దీనిపై ఇజ్రాయెల్ లోపల, బయట కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నెతన్యాహు ఈ విమర్శలకు జవాబిస్తూ.. "మేము గాజాను ఆక్రమించుకోబోవడం లేదు, కానీ హమాస్ నుంచి గాజాకు విముక్తి కల్పిస్తాం" అని అన్నారు. గాజా పూర్తిగా సైనిక రహిత ప్రాంతంగా మారుతుందని, పాలస్తీనా అథారిటీ, హమాస్ లేదా ఏ ఇతర ఉగ్రవాద సంస్థ లేని ఒక పౌర పరిపాలనను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. ఈ ప్రణాళిక తమ బందీలను విడిపించడానికి సహాయ పడుతుందని, భవిష్యత్తులో గాజా నుండి ఇజ్రాయెల్‌కు ఎటువంటి ముప్పు ఉండదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


ఈ సంభాషణలో నెతన్యాహు ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. అక్టోబర్ 7వ తేదీన జరిగిన హమాస్ దాడిని 'హోలోకాస్ట్ తర్వాత యూదులపై జరిగిన అత్యంత భయంకరమైన దాడి'గా ఆయన అభివర్ణించారు. ఆ దాడిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి మద్దతు ఇవ్వడానికి బదులుగా, జర్మనీ గాజాకు ఆయుధ ఎగుమతులను నిలిపివేయడం నిరాశ కలిగించిందని.. ఇది హమాస్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. అలాగే హమాస్‌ను ఓడించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఐదు సూత్రాలను ప్రకటించింది.


హమాస్‌ను నిరాయుధీకరణ చేయడం.


గాజాను సైనిక రహితంగా మార్చడం.


హమాస్ బందీలుగా ఉంచుకున్న వారందరినీ విడుదల చేయడం.


గాజాలో భద్రతా బాధ్యతను ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంచడం.


హమాస్ లేదా పాలస్తీనా అథారిటీ కాకుండా, ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా ఉండే ఒక ప్రత్యామ్నాయ పౌర పరిపాలనను ఏర్పాటు చేయడం.


ఈ ప్రణాళికపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. AFP వార్తా సంస్థ ప్రకారం.. చైనా, టర్కీ, బ్రిటన్, కొన్ని అరబ్ దేశాలు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ ఈ ప్రణాళిక పట్ల తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. హమాస్ ఈ చర్యను 'కొత్త యుద్ధ నేరం'గా అభివర్ణించింది. జర్మనీ కూడా ఇజ్రాయెల్ చర్యలపై తమకు అవగాహన కరువవుతోందని చెప్పి ఆయుధ ఎగుమతులను నిలిపివేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa