ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం

international |  Suryaa Desk  | Published : Sun, Aug 10, 2025, 07:59 PM

బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై సృష్టమైన ప్రకటన వెలువడింది. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తర్వాత ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 13వ పార్లమెంటరీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో జరుగుతాయని బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏఎంఎం నాసిర్ ఉద్దీన్ వెల్లడించారు. ఈ ప్రకటనతో దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్లయ్యింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సురక్షితంగా నిర్వహించడం ఒక పెద్ద సవాలని సీఈసీ పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి విశ్వాసం తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.


బంగ్లాదేశ్‌లో గత కొన్ని నెలలుగా రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. జూలైలో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనల కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దేశంలో శాంతి, భద్రతలను పునరుద్ధరించడానికి కృషి చేస్తోంది. రాజకీయ సంక్షోభం తర్వాత దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియను తిరిగి ప్రారంభించడం ఈ ఎన్నికల ప్రధాన లక్ష్యం. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించాలనే సీఈసీ నిర్ణయం, అంతకుముందు మధ్యంతర ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ రంజాన్ నెల రాకముందే ఎన్నికలు జరుగుతాయని ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా ఉంది.


  ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పాల్గొనడానికి సిద్ధం అవుతున్నాయి. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారెక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌‍పీ) కూడా ఎన్నికల్లో పోటీ చేయనుంది. అలాగే జూలైలో జరిగిన తిరుగుబాటులో కీలక పాత్ర పోషించిన నాయకులు కొత్తగా ఏర్పాటు చేసిన 'నేషనల్ సిటిజన్ పార్టీ' కూడా ఈ ఎన్నికల బరిలోకి దిగుతోంది. అయితే మధ్యంతర ప్రభుత్వం షేక్ హసీనా యొక్క అవామీ లీగ్ పార్టీ కార్యకలాపాలను రద్దు చేయడంతో.. ఆ పార్టీ భవిష్యత్తుపై ఇంకా సందిగ్ధత నెలకొంది.


ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. దేశంలో పూర్తి స్థాయి ప్రజాస్వామ్యాన్ని, స్థిరమైన ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి ఇవి కీలకంగా మారబోతున్నాయి. బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలకు ఈ ఎన్నికలు ఒక పరిష్కారాన్ని చూపుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఎన్నికలు నిజంగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగితే, అది బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యానికి ఒక కొత్త దశను తీసుకు వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa