టీమిండియా సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే క్రికెట్ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఆటగాళ్ల ఎంపిక అనేది పూర్తిగా వారి ప్రదర్శనపైనే ఆధారపడి ఉండాలని, ఫామ్లో ఉన్నంత కాలం వారు జట్టులో కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డాడు.ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన గంగూలీ, "ఎవరైతే బాగా ఆడతారో, వారే జట్టులో ఉండాలి. వన్డేల్లో కోహ్లీ రికార్డు అద్భుతం. రోహిత్ శర్మ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇద్దరూ అసాధారణమైన ఆటగాళ్లు" అని ప్రశంసించాడు. ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు ఈ ఇద్దరు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, వారి వన్డే కెరీర్పై గంగూలీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.అయితే, కోహ్లీ, రోహిత్ల రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలపై తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని గంగూలీ స్పష్టం చేశారు. ఈ అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీసే వారికి చివరిది కావచ్చని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 19 నుంచి పెర్త్, అడిలైడ్, సిడ్నీ వేదికలుగా ఈ సిరీస్ జరగనుంది.ఇదే సమయంలో, టీమిండియా భవిష్యత్తుపై కూడా గంగూలీ మాట్లాడాడు. సెప్టెంబర్ 9 నుంచి దుబాయ్లో ప్రారంభం కానున్న టీ20 ఆసియా కప్లో భారత జట్టే బలమైన ఫేవరెట్ అని ఆయన జోస్యం చెప్పారు. "ఐపీఎల్, ఐదు టెస్టుల సిరీస్ తర్వాత జట్టు మంచి విశ్రాంతి తీసుకుంది. వైట్-బాల్ క్రికెట్లో టీమిండియా చాలా బలంగా ఉంది. దుబాయ్లోని మంచి వికెట్లపై మన జట్టును ఓడించడం కష్టం" అని విశ్లేషించాడు. టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ను ప్రశంసిస్తూ, అతనికి కెప్టెన్గా ఉజ్వల భవిష్యత్తు ఉందని గంగూలీ కితాబిచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa