ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు రావడంతో జలవిద్యుత్, నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టానికి చేరువవుతున్న నేపథ్యంలో అధికారులు మూడోసారి గేట్లను ఎత్తారు. ప్రస్తుతం నాలుగు గేట్లు ఎత్తి, వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంలోకి గణనీయంగా వరదనీరు వస్తోంది. ప్రస్తుతం 2,02,456 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతుండగా, 2,09,199 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదులుతున్నారు. గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
పోతిరెడ్డిపాడు హెచ్ రెగ్యులేటర్ ద్వారా 35 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు నాలుగు స్పిల్వే గేట్ల ద్వారా 1,08,076 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 882.70 అడుగులకు చేరింది. గరిష్ఠ స్థాయికి చేరువ కావడంతో మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa